కొంతకాలంగా సరైన ఫామ్లో లేక, అంతర్జాతీయ క్రికెట్లో సెంచరీ లేక ఇబ్బంది పడుతున్న స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆదివారం నాడు పాకిస్తాన్తో జరిగే ఆసియా కప్ మ్యాచ్లో బరిలో దిగనున్న ఈ క్రికెటర్.. తనలో సత్తా లేకుంటే ఇంత కాలం క్రికెట్ ఆడగలిగి ఉండేవాడిని కాదన్నాడు.
ప్రస్తుతం తన ఆటతీరు ఎలా ఉందో తనకు ఒక అంచనా ఉందని స్పష్టం చేసిన కోహ్లీ.. ‘‘నా ఆట ఎక్కడ ఉందో నాకు తెలుసు. పరిస్థితులు, వాతావరణం, రకరకాల బౌలర్లను ఎదుర్కొనే సత్తా ఏమాత్రం లేకుండా ఇంతకాలం అంతర్జాతీయ కెరీర్ సాగుతుందని నేననుకోను. కాబట్టి ఇదంతా ప్రాసెస్ చేసుకోవడానికి నాకు ఇదో ఈజీ ఫేజ్. దీన్ని వదిలేయాలని నేను అనుకోవడం లేదు. దీన్నుంచి కూడా సాధ్యమైనంత నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నా.
ఒక ఆటగాడిగా, మనిషికగా నా విలువలను అర్థం చేసుకోవాలని అనుకుంటున్నా. నేను చెయ్యాల్సిన పనులన్నీ చేస్తుంటే చాలు. ఎత్తుపల్లాలు సహజం’’ అని వివరించాడు. అలాగే ఒక్కసారి తను ఈ ఫేజ్ నుంచి బయటకు వస్తే.. ఎంత నిలకడగా రాణించగలడో తనకు తెలుసునని తేల్చేశాడు. తన అనుభవాలన్నీ కూడా చాలా విలువైనవని, గతంలోకానీ ప్రస్తుత కష్టకాలంలోకానీ తనకు ఎదురైన అనుభవాలన్నీ కూడా అమూల్యమైనవేనని అన్నాడు.