తాజాగా ముగిసిన ఇంగ్లండ్-భారత్ టెస్టు మ్యాచ్ తర్వాత ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్లో మార్పులు చోటు చేసుకున్నాయి. భారత్ తరఫున అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన రిషభ్ పంత్ టాప్ టెన్ బ్యాటర్ల జాబితాలో చోటు దక్కించుకోవడమే కాకుండా.. కెరీర్ అత్యుత్తమంగా 5వ స్థానానికి చేరుకున్నాడు.
ఇంగ్లండ్ మాజీ సారధి జో రూట్ తన అగ్రస్థానాన్ని మరింత పటిష్టం చేసుకోగా.. పరుగుల వరద పారిస్తున్న స్టార్ జానీ బెయిర్స్టో 11 స్థానాలు ఎగబాకి 10వ ర్యాంకు చేరుకున్నాడు. అదే సమయంలో ఈ టెస్టు రెండు ఇన్నింగ్సుల్లోనూ నిరాశ పరిచిన భారత మాజీ సారధి విరాట్ కోహ్లీ తొలిసారి టాప్-10లో చోటు కోల్పోయాడు.
ఇలా టాప్ టెన్లో కోహ్లీ తన స్థానం కోల్పోవడం గత ఆరేళ్లలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. ప్రస్తుతం కోహ్లీ 13వ స్థానంలో ఉన్నాడు. ఆల్రౌండర్ల జాబితాలో చెప్పుకోదగ్గ మార్పులు రాలేదు. ఇటీవల ఇంగ్లండ్ టెస్టు జట్టులో మళ్లీ చేరిన ఆండర్సన్ ఒక స్థానం మెరుగై ఆరో ర్యాంకులో నిలిచాడు.