Riki Ponting on Kohli | కొంత కాలంగా ఫామ్ కోల్పోయిన టీం ఇండియా మాజీ సారధి విరాట్ కోహ్లీకి ఆస్ట్రేలియా వెటరన్ రికీ పాంటింగ్ మద్దతునిచ్చాడు. ప్రతి క్రికెటర్కు కూడా జీవితంలో ఈ దశ వస్తుందని, కానీ, త్వరలోనే కోహ్లీ ఫామ్లోకి వస్తాడని పాంటింగ్ అభిప్రాయ పడ్డాడు. ఫామ్ కోల్పోయిన విరాట్ కోహ్లీ.. గత మూడేండ్లలో ఏ ఫార్మాట్లోనూ ఒక సెంచరీ కూడా చేయలేదు. దీంతో ఆయన అలసిపోయాడని, కోహ్లీ పనై పోయిందని విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ తరుణంలో విరాట్ కోహ్లీకి రికీ పాంటింగ్ మద్దతుగా నిలవడం ప్రాధాన్యం సంతరించుకున్నది.
సుమారు 10-12 ఏండ్లు అద్భుతంగా ఆడిన కోహ్లీ.. ఫెయిలైన సందర్భాలు తక్కువ. ఆయన మంచి ఫ్రొఫెషనల్ క్రికెటర్. ఇటీవల జరిగిన ఐపీఎల్ టోర్నీ సందర్భంగా కోహ్లీ అలసటపై చాలా చర్చ జరిగింది. కనుక కోహ్లీ తనకు తాను ఆత్మశోధన చేసుకోవాలని సూచించాడు రికీ పాంటింగ్. టెక్నికల్ ప్రాబ్లమా.. మెంటల్ సమస్య అన్న సంగతి నిర్ధారించుకుంటే త్వరలోనే తిరిగి ఫామ్లోకి వచ్చేందుకు కష్ట పడతాడని నమ్ముతున్నట్లు తెలిపాడు.
ఆటగాళ్లు అలసిపోయినట్లు అంగీకరించరని రికీ పాంటింగ్ వ్యాఖ్యానించాడు. ఏదోలా ప్రాక్టీస్ టైంకు వచ్చి మ్యాచ్కు సిద్ధం అవుతారని తెలిపాడు. విశ్రాంతి తీసుకున్నప్పుడే ఎంత అలసిపోయారన్నది వారికి తెలుస్తుందన్నాడు. టీం ఇండియా-దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న ఐదు టీ-20 మ్యాచ్ల సిరీస్లో విరాట్ కోహ్లీకి బీసీసీఐ విశ్రాంతినిచ్చింది.