మెదక్ అర్బన్, జూలై 20: ఎంఎస్ అగర్వాల్ స్టీల్ కంపెనీ విస్తరణ అనుమతులు రద్దు చేయాలని మాజీ డిప్యూటీ స్పీకర్, బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు పద్మాదేవేందర్రెడ్డి, బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్రెడ్డి డిమాండ్ చేశారు. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలంలోని చెట్లగౌరారం, రంగాయిపల్లి గ్రామాలకు చెందిన ప్రజలతో ఎంఎస్ అగర్వాల్ స్టీల్ కంపెనీ విస్తరణ అనుమతులు రద్దు చేసి ఫ్యాక్టరీని మూసివేయాలని సోమవారం మెదక్ కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామస్తుల సమక్షంలో ప్రభుత్వం మరోసారి ప్రజాభిప్రాయ సేకరణ చేయాలని డిమాండ్ చేశారు. ఫ్యాక్టరీ నుంచి వస్తున్న కాలుష్యంతో ఎంతోమంది ప్రజలు అనారోగ్యాలకు గురయ్యారన్నారు. పలుమార్లు అధికారులకు తెలిపినా చర్యలు తీసుకోవడం లేదన్నా రు. ఎంఎస్ అగర్వాల్ స్టీల్ ఫ్యాక్టరీని మూసివేసే వరకు బీఆర్ఎస్ ప్రజలకు మద్దతుగా ఉంటుందన్నారు.
మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలంలోని చెట్లగౌరారం, రంగాయిపల్లి గ్రామస్తులకు మద్దతుగా ఆందోళనలో పాల్గొనేందుకు పద్మాదేవేందర్రెడ్డి, ప్రతాప్రెడ్డి హాజరయ్యారు. ఎంఎస్ అగర్వాల్ స్టీల్ కంపెనీ వెంటనే మూసివేయాలని ప్రజలు డిమాండ్ చేశారు. భారీ సంఖ్యలో ప్రజలు హాజరు కావడంతో పోలీసులు కలెక్టరేట్లోకి అనుమతి ఇవ్వలేదు. దీంతో బీఆర్ఎస్ నాయకులు, ప్రజలు కలెక్టరేట్ గేటు ఎదుట ఆందోళన చేశారు. కలెక్టర్ లేకపోవడంతో జిల్లా అధికారులకు వినతిపత్రం ఇచ్చేందుకు అనుమతి ఇవ్వాలని పోలీసులను కోరినా వారు పట్టించుకోలేదు. పోలీస్లు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కలెక్టరేట్ గేట్ వద్దకు డీఆర్ఎస్ అంబదాస్ రాజేశ్వర్ వచ్చి వినతి పత్రం తీసుకున్నారు. బీఆర్ఎస్ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.