Virat Kohli : టన్నుల కొద్దీ పరుగులు. రికార్డు స్థాయిలో శతకాలు.. ప్రపంచంలోని అత్యుత్తమ ప్లేయర్స్లో ఒకడిగా పేరు.. ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించే క్లాస్ ఆటగాడిగా మాజీలు కొనియాడిన క్రికెటర్.. ఛేజింగ్ మాస్టర్గా రికార్డులు బద్ధలు కొట్టిన విరాట్ కోహ్లీ.. టెస్టుల్లో మాత్రం ఫామ్ కొనసాగించలేకపోతున్నాడు. భారీ స్కోర్లు కాదు కదా కనీసం 50 రన్స్ కూడా చేయడంలో విఫలం అవుతున్నాడు.
స్వదేశంలో ఆస్ట్రేలియా సిరీస్లో కోహ్లీ అత్యధిక స్కోర్.. 46. మిడిలార్డర్లో కీలకమైన ఈ స్టార్ ప్లేయర్ తక్కువ స్కోర్కే పెవిలియన్ చేరుతూ ఫ్యాన్స్ను నిరాశ పరుస్తున్నాడు. నాలుగో టెస్టులో అయినా అతడు శతకం బాదాలని అందరూ కోరుకుంటున్నారు. ఎందుకంటే..? కింగ్ కోహ్లీ టెస్టుల్లో మూడంకెల స్కోర్ చేసి దాదాపు మూడేళ్లు దాటుతోంది. అహ్మదాబాద్ స్టేడియంలో మార్చి 9న నాలుగో టెస్టు జరగనుంది.
కెరీర్లో వేలకొద్దీ పరుగులు చేసిన కోహ్లీ 15 టెస్టు ఇన్నింగ్స్లు ఆడిన ఒక్క ఫిఫ్టీ కూడా చేయలేకపోయాడు. స్పిన్నర్లను ఆడడంలో ఇబ్బంది పడుతున్నాడు. బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీలో అయితే అతను 5 సార్లు స్పిన్నర్ల బౌలింగ్లోనే ఔటయ్యాడు. ఆసీస్ స్పిన్ త్రయం నాథన్ లియాన్, టాడ్ మర్ఫీ, కునేమాన్లపై ఆధిపత్యం చెలాయించలేకపోయాడు. మూడు టెస్టుల్లో 111 రన్స్ చేశాడంతే.
దాదాపు మూడేళ్లుగా అంతర్జాతీయ క్రికెట్లో విరాట్ ఒక్క సెంచరీ కూడా కొట్టలేదు. ఫామ్ లేమితో విమర్శలు ఎదుర్కొన్న అతను కొన్ని రోజులు ఆటకు దూరమయ్యాడు. విరామం తర్వాత మైదానంలోకి దిగిన కోహ్లీ ఆసియాకప్తో ఫామ్లోకి వచ్చాడు. శ్రీలంకపై సెంచరీ కొట్టాడు. ఆ తర్వాత టీ20 వరల్డ్ కప్లోనూ రాణించాడు. పాకిస్థాన్పై అద్భుత ఇన్నింగ్స్ ఆడి మునపటి విరాట్ను గుర్తు చేశాడు. బంగ్లాదేశ్, శ్రీలంక సిరీస్లో ఏకంగా మూడు సెంచరీలు సాధించాడు.