టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఫామ్ లేక నానా ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. తీరికలేని ఆట వల్లనే కోహ్లీ ఫామ్ పోయిందనే ఉద్దేశ్యంతో వెస్టిండీస్ పర్యటనలో అతనికి పూర్తిగా రెస్ట్ ఇచ్చేశారు. దీంతో ప్రస్తుతం యూరప్ పర్యటనలో ఉన్నాడీ స్టార్ బ్యాటర్. కొన్ని రోజుల క్రితం ఇంగ్లండ్ పర్యటనలో అత్యంత పేలవ ప్రదర్శన కనబరిచిన కోహ్లీ.. టెస్టుల్లో టాప్ టెన్ బ్యాటర్ల జాబితాలో చోటు కోల్పోయాడు.
టీ20ల్లో కూడా టాప్ టెన్ జాబితాలో నుంచి తప్పుకున్నాడు. అతనికి అచ్చొచ్చిన వన్డేల్లో కూడా కోహ్లీ ర్యాంకు కిందకు పడిపోతూనే వచ్చింది. తాజాగా ఐసీసీ విడుదల చేసిన ర్యాంకింగ్స్లో కోహ్లీ రేటింగ్ పాయింట్లు 774కు పడిపోయాయి. దీంతో అతను ఐదో స్థానానికి చేరాడు. గడిచిన ఏడేళ్లలో ఇదే కోహ్లీ వరస్ట్ ర్యాంక్. అక్టోబర్ 2015 తర్వాత టాప్ 4 వన్డే బ్యాటర్ల జాబితాలో కోహ్లీ స్థానం కోల్పోవడం ఇదే తొలిసారి.
అయితే పాకిస్తాన్ సారధి బాబర్ ఆజమ్ మాత్రం తన ఆధిపత్యం చెలాయిస్తూనే ఉన్నాడు. వన్డేలు, టీ20ల్లో టాప్ బ్యాటర్గా ఉన్న బాబర్.. టెస్టుల్లో కూడా తన స్థానం మెరుగు పరుచుకున్నాడు. శ్రీలంకపై అద్భుతంగా ఆడిన అతను టెస్టుల్లో మూడో ర్యాంకుకు చేరుకున్నాడు. దీంతో మూడు ఫార్మాట్లలో టాప్-3లో ఉన్న బ్యాటర్గా అరుదైన రికార్డు తన పేరిట లిఖించుకున్నాడు.