ప్రపంచ క్రికెట్లో అందరి కన్నా ఎగ్రెసివ్గా ఉంటే ఆటగాడు ఎవరు? అని అడిగితే ఎవరైనా సరే టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ పేరే చెప్తారు. మైదానంలో అతని తీరు అలాగే ఉంటుంది. క్రికెట్ పట్ల అంత ప్యాషన్ ఉన్న ఆటగాడు దొరకడం కష్టమని మాజీలు సైతం కితాబిస్తారు.
అయితే కొందరు మాత్రం కోహ్లీ అంత ఎగ్రెసివ్గా ఉండాల్సిన అవసరం లేదని అభిప్రయాలు కూడా వ్యక్తం చేశారు. టీమిండియా గ్రేట్ కెప్టెన్లలో ఒకడైన ధోనీ ఎంత ప్రశాంతంగా ఉండేవాడో అందరికీ తెలిసిందే. కోహ్లీ కూడా కెప్టెన్ కూల్ ధోనీలా ఉండాలని చాలా మంది సలహాలిచ్చారు.
కానీ కోహ్లీ మాత్రం తన పంథాలోనే ఆటను ఆస్వాదిస్తూ ముందుకు సాగుతున్నాడు. ఈ ప్రవర్తనపై తాజాగా అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన హర్భజన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కోహ్లీకి ఉండే ఎగ్రెసివ్నెస్ అతనికి సరిగ్గా సరిపోతుందని, అలాంటి ఆటగాళ్లు భారత్కు మరింత మంది కావాలని భజ్జీ తేల్చిచెప్పాడు.
‘ఒకప్పుడు ఆస్ట్రేలియా పర్యటనకు భారత జట్టు వెళ్తే.. మ్యాచ్ను ఎలా కాపాడుకోవాలి? అనేదే ఆటగాళ్ల మససులో ఉండే ఆలోచన. కానీ కోహ్లీ హయాంలో సిరీస్ ఎలా గెలవాలా? అనేదే వాళ్ల ఆలోచన’ అని వివరించాడు. ఆస్ట్రేలియాలో జరిగిన ఒక మ్యాచ్ సమయంలో కోహ్లీకి, తనకు మధ్య జరిగిన సంభాషణను కూడా భజ్జీ గుర్తుచేసుకున్నాడు.
’నాకు గుర్తుండి ఆ మ్యాచ్లో భారత జట్టు 400 లక్ష్యాన్ని ఛేదించాల్సి వచ్చిందనుకుంటా. కోహ్లీ అద్భుతమైన సెంచరీ చేశాడు. కానీ జట్టు ఓడిపోయింది. అతనితో మాట్లాడుతూ మ్యాచ్ డ్రా అవ్వాల్సిందని అన్నా.. అప్పుడు కోహ్లీ చెప్పిన జవాబు నాకింకా గుర్తే’ అంటూ అప్పటి కోహ్లీ మాటలను వెల్లడించాడు.
‘డ్రా అయిన టెస్టు మ్యాచ్కు ఎలాంటి ప్రాముఖ్యతా ఉండదు. అయితే గెలవాలి లేదా ఓడాలి. పోరాడటం నేర్చుకున్న రోజున మనకు గెలవడం కూడా తెలుస్తుంది. ఒక రోజు కచ్చితంగా ఇది జరుగుతుంది’ అని కోహ్లీ చెప్పాడట. అదే ప్రస్తుతం భారత జట్టులో వచ్చిన మార్పని భజ్జీ పేర్కొన్నాడు.
ఆ తర్వాత రెండు సార్లు ఆస్ట్రేలియా వెళ్లి, కంగారూలను ఓడించి వచ్చారని కొనియాడాడు. ఇంగ్లండ్లో కూడా అద్భుతంగా ఆడారని, ఈ సౌతాఫ్రికా సిరీస్లో కూడా భారత జట్టు గొప్పగా ఆడి సిరీస్ చేజిక్కించుకోవాలని ఆశించాడు. అలాగే కోహ్లీ కనుక ధోనీలా ప్రశాంతంగా ఉంటే అతను ఇన్ని పరుగులు చేసి, ఇన్ని ఘనతలు సాధించేవాడు కాదని భజ్జీ అభిప్రాయపడ్డాడు.