టీమిండియా మాజీ కెప్టెన్, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ.. మరోసారి వార్తల్లో నిలిచాడు. సౌతాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో భారత జట్టు ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్లో సఫారీల ఇన్నింగ్స్ సందర్భంగా.. భారత మాజీ కెప్టెన్ కోహ్లీ, ప్రొటీస్ కెప్టెన్ టెంబా బవుమా మాటల యుద్ధానికి తెరలేపారు. పార్ల్ వేదికగా జరిగిన
ఈ మ్యాచ్లో సౌతాఫ్రికా జట్టు తొలుత బ్యాటింగ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఇన్నింగ్స్ 36వ ఓవర్లో కోహ్లీ, బవుమా వాగ్వాదానికి దిగారు. ఆ సమయంలో ఫీల్డింగ్ చేస్తున్న కోహ్లీ.. బంతిని స్ట్రైకర్ ఎండ్ వైపు విసిరాడు. అది బవుమాను దాదాపు తాకుతూ పక్కకు వెళ్లింది. ఈ క్రమంలోనే ఇద్దరూ ఒకరిపై ఒకరు ఘాటు వ్యాఖ్యలు చేసుకున్నారు.
భారత్ ఓడిపోయిన ఈ మ్యాచ్లో బవుమా 143 బంతులు ఎదుర్కొని 110 పరుగులు చేశాడు. అనంతరం రెండో ఇన్నింగ్సులో బ్యాటింగ్ చేసిన కోహ్లీ.. 51 పరుగులు చేసి అవుటయ్యాడు. కోహ్లీ తర్వాత వచ్చిన ఎవరూ సరిగా ఆడకపోవడంతో భారత జట్టు 31 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది.