World Cup 2023 | విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ.. అంతర్జాతీయ క్రికెట్లో భారత ఆధిపత్యాన్ని కొనసాగించడంలో కీలక పాత్ర పోషిస్తున్న ఆటగాళ్లు. పరిస్థితులను అర్థం చేసుకోవడం వీళ్లను మీంచిన వారు లేరంటే అతిశయోక్తి కాదు. జట్టు గెలువడం కోసం తమ గేమ్ ప్లాన్ను మార్చుకోవడం ఈ ఇద్దరు ఘనపాటులు. తాజా ప్రపంచకప్లోనే ఇది పలుమార్లు నిరూపితమైంది. మెగాటోర్నీలో ఐదు మ్యాచ్లాడి అన్నీట్లోనూ గెలిచిన టీమ్ఇండియా అన్నీ సార్లు లక్ష్యాన్ని ఛేదించగా.. ఇంగ్లండ్తో పోరులో రోహిత్ సేనకు తొలిసారి బ్యాటింగ్ చేయాల్సిన అవసరం పడింది. తొలి పరీక్షలో టాపార్డర్ విఫలం కాగా.. నేనున్నానంటూ రోహిత్ శర్మ జట్టును ఆదుకున్నాడు.
శుభ్మన్ గిల్ (9), విరాట్ కోహ్లీ (0), శ్రేయస్ అయ్యర్ (4) స్వల్ప స్కోర్లకే వెనుదిరగడంతో భారత జట్టు ఒక దశలో 40 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో తన సహజసిద్ధమైన ఆటతీరును పక్కన పెట్టిన రోహిత్.. ఇన్నింగ్స్ను నిర్మించే బాధ్యత భుజానెత్తుకొని దాన్ని సమర్థవంతంగా నిర్వర్తించి చూపాడు. ఇంగ్లిష్ బౌలర్లు పరీక్ష పెడుతున్న సమయంలో క్లిష్ట పరిస్థితులకు ఎదురొడ్డి జట్టును కష్టాల్లో నుంచి బయట పడేశాడు.
ఈ టోర్నీలో ఇప్పటి వరకు సిక్సర్లతో రెచ్చిపోతూ జట్టుకు మెరుపు ఆరంభాలు ఇస్తూ వచ్చిన హిట్మ్యాన్.. దానికి పూర్తి భిన్నంగా నెమ్మదిగా ఆడుతూ ఒక్కో పరుగు జోడించి భారత్ను గట్టెక్కించాడు. మిడిలార్డర్లో కేఎల్ రాహుల్ (39), సూర్యకుమార్ యాదవ్ (49) కూడా రాణించడంతో లక్నో వంటి క్లిష్టమైన పిచ్పై టీమ్ఇండియా పోరాడే స్కోరు చేయగలిగింది. వరల్డ్కప్లో ఇప్పటికే ఓ సెంచరీ చేసిన రోహిత్ శర్మ ఈ మ్యాచ్లో 13 పరుగులతో శతకం చేసే అవకాశం చేజార్చుకున్నాడు. అయినా సెంచరీ కన్నా విలువైన ఇన్నింగ్స్తో అలరించాడు. మిగిలిన ప్లేయర్లు పరుగులు తీసేందుకు నానా తంటాలు పడుతున్న పిచ్పై హిట్మ్యాన్ అలవోకగా రన్స్ తీసి తన విలువేంటో చాటుకున్నాడు.
వన్డే ప్రపంచకప్లో భాగంగా భారత్ ఆడిన తొలి మ్యాచ్లోనూ రోహిత్ సేన దాదాపు ఇలాంటి పరిస్థితే ఎదుర్కొంది. ఆస్ట్రేలియాతో పోరులో లక్ష్యం చిన్నదే అయినా.. బ్యాట్తో ఒక్క పరుగు రాకముందే ముగ్గురు (రోహిత్, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్) డకౌట్గా వెనుదిరగడంతో.. భారత జట్టు పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఈ దశలో విరాట్ తన దమ్మేంటో నిరూపించుకున్నాడు. యావత్ ప్రపంచం తనను చేజ్ మాస్టర్ అని ఎందుకు అంటుందో బ్యాట్తో చూపించాడు.
ఒక్కో పరుగు జోడిస్తూ.. లక్ష్యాన్ని కరిగించిన విరాట్.. అవసరమైన సమయంలో భారీ షాట్లు ఆడేందుకు కూడా వెనుకాడలేదు. కేఎల్ రాహుల్తో కలిసి చక్కటి భాగస్వామ్యం నమోదు చేసిన కోహ్లీ జట్టును విజయ తీరాలకు చేర్చాడు. దీంతో మెగాటోర్నీలో రోహిత్ సేనకు అవసరమైన శుభారంభం లభించగా.. ఆ తర్వాత దాన్నే కొనసాగించిన భారత్ వరుస విజయాలతో దూసుకెళ్తున్నది. పుష్కర కాలం తర్వాత భారత జట్టు వన్డే ప్రపంచకప్ నెగ్గాలంటే ఈ ఇద్దరూ చివరి వరకూ ఇదే జోరు కొనసాగించాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.