హైదరాబాద్: టీమ్ఇండియా స్టార్ బ్యాట్స్మెన్ కింగ్ కోహ్లీ సరికొత్త రికార్డుకు చేరువలో ఉన్నాడు. మరో 28 పరుగులు చేస్తే టీ20 ప్రపంచకప్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మెన్గా చరిత్ర సృష్టించనున్నాడు. ప్రస్తుతం టీ 20ల్లో టాప్ స్కోరర్గా శ్రీలంక మాజీ కెప్టెన్ మహేల జయవర్ధనే కొనసాగుతున్నాడు. ఇప్పటికే భీకర ఫామ్లో ఉన్న కోహీ.. నేడు దక్షిణాఫ్రికాతో జరుగనున్న మ్యాచ్లో కోహ్లీ మరో 28 రన్స్ నమోదుచేస్తే జయవర్ధనేను దాటేయనున్నాడు. మరో 11 పరుగులు చేస్తే టీ20 ప్రపంచకప్లో వెయ్యి రన్స్ పూర్తిచేసిన రెండో బ్యాట్స్మెన్గా నిలువనున్నాడు.
జయవర్దనే 31 మ్యాచుల్లో 1,016 పరుగులు చేయగా, కోహ్లీ 23 మ్యాచుల్లోనే 989 రన్స్ చేశాడు. ఇందులో 12 అర్ధ సెంచరీలు ఉండటం విశేషం. ఇక మూడో స్థానంలో యూనివర్సల్ బాస్ క్రిస్గేల్ ఉన్నాడు. అతడు 33 మ్యాచుల్లో 965 పరుగులు చేశాడు. నాలుగో ప్లేస్ హిట్మ్యాన్ రోహిత్ శర్మ కొనసాగుతున్నాడు. రోహిత్ 35 మ్యాచ్ ల్లో 904 పరుగులు చేశాడు.