క్రికెట్ ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన సిరీసుల్లో యాషెస్ ఒకటి. ఈసారి ఆస్ట్రేలియాలో జరిగిన ఈ సిరీస్లో కంగారూలు విశ్వరూపమే చూపారు. తొలి మూడు టెస్టుల్లో ఇంగ్లండ్ను ఓ ఆటాడుకొని ఘనవిజయాలు సాధించారు. నాలుగో టెస్టు డ్రాగా ముగిసినప్పటికీ, మళ్లీ ఐదో టెస్టులో ఆసీస్ ఘనవిజయం సాధించింది.
ఈ క్రమంలో సిరీస్ 4-0తో ఆస్ట్రేలియా వశమైంది. ఈ విక్టరీ సెలబ్రేషన్స్లో ఆటగాళ్లందరూ ఛాంపేన్ బాటిళ్లు పట్టుకొని సెలబ్రేట్ చేసుకునేందుకు రెడీ అయ్యారు. అలాంటి సమయంలో ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ చేసిన పని ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
చాలారోజుల తర్వాత ఆసీస్ జట్టులోకి పునరాగమనం చేసిన ఉస్మాన్ ఖవాజా.. వచ్చీరావడంతోనే రెండు సెంచరీలతో తన సత్తా చాటాడు. అతను ముస్లిం కావడంతో మద్యానికి దూరంగా ఉంటాడు. సహచరులంతా ఛాంపేన్ బాటిళ్లు పట్టుకొని ఉండటంతో అతను ఛాంపియన్స్ ఫొటో తీసుకునేటప్పుడు కొంచెం దూరంగా నిలబడ్డాడు.
ఇది గమనించిన కమిన్స్.. సహచరులను ఛాంపేన్ బాటిళ్లు ఓపెన్ చేయొద్దని చెప్పాడు. ఖవాజాను పిలిచి ముందు ఫొటోకు జట్టు సభ్యులందరితో కలిసి ఫోజిచ్చాడు. ఆ తర్వాత ఖవాజా లేకుండా అందరూ ఛాంపేన్ బాటిళ్లతో సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు కమిన్స్ చేసిన పనికి ఫిదా అవుతున్నారు. ఇలాంటి చిన్న చిన్న పనులే కమిన్స్ను గొప్పవాణ్ణి చేస్తాయంటూ మెచ్చుకుంటున్నారు.