ప్రస్తుతం జరుగుతున్న అండర్-19 ప్రపంచకప్ మ్యాచ్లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. మ్యాచ్ జరుగుతుండగా భారీ భూకంపం వచ్చింది. శనివారం నాడు జింబాబ్వే, ఐర్లాండ్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. కీలకమైన ఈ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్ 6వ ఓవర్ వేసే సమయంలో భూకంపం వచ్చింది.
ఈ సమయంలో కెమెరాలన్నీ వణికిపోవడంతో వీడియోలు కూడా సరిగా రాలేదు. ఆ సమయంలో మ్యాచ్ కామెంటేటర్ చాలా ఆందోళన చెందాడు. ఇది కచ్చితంగా భూకంపమేనని, భారీగా భూమి అదురుతోందని అతను చెప్పాడు.
ఇది 5.2 మ్యాగ్నిట్యూడ్ భూకంపమని ఆ తర్వాత తెలిసింది. ట్రినిడాడ్ అండ్ టొబాగో సమీపంలో భూ అంతర్భాగంలో 10 కిలోమీటర్ల లోతున ఈ భూకంపం కేంద్రీకృతమైందని సమాచారం. సుమారు 20 సెకన్లపాటు భూమి కంపించిన తర్వాత ఆట యధావిధిగా కొనసాగింది.