హైదరాబాద్, ఆట ప్రతినిధి: ఐపీఎల్ తరహాలో తెలంగాణలో తొలిసారి నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ టైటిల్ స్పాన్సర్ హక్కులు శ్రీనిధి యూనివర్సిటీ దక్కించుకుంది. 8 ఫ్రాంచైజీ జట్లతో జరిగే మెగా లీగ్కు ప్రముఖ నటుడు విజయ్ దేవరకొండ బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తాడని హెచ్సీఏ సెక్రటరీ జీవన్ రెడ్డి, లీగ్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ ఆగం రావు మంగళవారం హైదరాబాద్లో జరిగిన మీడియా సమావేశంలో తెలిపారు. టైటిల్ స్పాన్సర్గా తొలి సీజన్కు శ్రీనిధి రూ. 3 కోట్లు, రెండో సీజన్కు రూ. 5 కోట్లు, మూడో ఏడాది రూ. 7 కోట్లు చెల్లించేలా ఒప్పందం చేసుకున్నామని జీవన్ రెడ్డి వెల్లడించారు.
తొలి సీజన్ విన్నర్కు రూ.1 కోటి, రన్నరప్కు రూ.50 లక్షలు, 3,4వ స్థానాల్లో నిలిచిన జట్లకు రూ.25 లక్షల చొప్పున నగదు బహుమతి అందిస్తామని పేర్కొన్నారు. టోర్నీ షెడ్యూల్ను కూడా ప్రకటించారు. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ మినహా ఐపీఎల్ రూల్స్ అన్నీ టీజీ20లో ఉంటాయని ఆగం రావు తెలిపారు. ఈ నెల 21న ఉప్పల్ స్టేడియంలో జరిగే ఆరంభ మ్యాచ్లో పాలమూరు స్ట్రయికర్స్, ఖమ్మం ఏసెస్ జట్లు పోటీపడనున్నాయి.
ఈ టోర్నీకి బీసీసీఐ అనుమతి లేదని జరుగుతున్న ప్రచారాన్ని జీవన్ రెడ్డి, ఆగం రావు అన్నారు. బోర్డు అనుమతి లేకపోతే తిలక్ వర్మ, సిరాజ్ లాంటి టీమిండియా క్రికెటర్లు టోర్నీలో పాల్గొనేందుకు ఎందుకు ముందుకు వస్తారని ప్రశ్నించారు. లీగ్ ఆరంభానికి ముందే అన్ని ఫ్రాంచైజీల ప్లేయర్లు, కోచింగ్ స్టాఫ్ బీసీసీఐ అవినీతి నిరోధక యూనిట్ (ఏసీయూ) కంట్రోల్లోకి వెళ్తారని చెప్పారు. బోర్డు త్వరలోనే ఏసీయూ అధికారులను హైదరాబాద్కు పంపిస్తుందని తెలిపారు.