దేశవాళీ క్రికెట్లో హిమాచల్ ప్రదేశ్ చరిత్ర సృష్టించింది. మొట్టమొదటి సారిగా విజయ్ హజారే ట్రోఫీని కైవసం చేసుకుంది. ఈ టోర్నీ ఫైనల్లో తమిళనాడుతో తలపడిన హిమాచల్ ప్రదేశ్.. అద్భుతమైన పోరాట పటిమ కనబర్చింది. దినేష్ కార్తీక్ (116) అద్భుతమైన శతకానికి మిగతా ఆటగాళ్ల ప్రదర్శన కూడా తోడవడంతో తమిళనాడు జట్టు 49.4 ఓవర్లలో 314 పరుగులకు ఆలౌటయింది.
భారీ లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన హిమాచల్ ప్రదేశ్ను శుభమ్ అరోరా (136) ఆదుకున్నాడు. అతనికి మిగతా ఆటగాళ్లు కూడా మంచి సహకారం అందించారు. దీంతో హిమాచల్ జట్టు 47.3 ఓవర్లలో 299/4తో నిలిచింది. అయితే అప్పుడే బ్యాడ్ లైట్ కారణంగా మ్యాచ్ ఆపేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. వీజేడీ (వి. జయదేవన్) పద్ధతి ప్రకారం 11 పరుగుల తేడాతో హిమాచల్ ప్రదేశ్ విజేతగా నిలిచినట్లు అంపైర్లు ప్రకటించారు. ఈ విజయంతో దేశవాళీ క్రికెట్లో తొలిసారిగా ఒక ట్రోఫీని హిమాచల్ ప్రదేశ్ గెలుచుకుంది.