విజయం దిశగా హైదరాబాద్
కటక్: టీమ్ఇండియా ఆటగాడు హనుమ విహారి (106; 15 ఫోర్లు) సూపర్ సెంచరీతో కదం తొక్కడంతో చండీగఢ్తో జరుగుతున్న రంజీ మ్యాచ్లో హైదరాబాద్ విజయానికి చేరువైంది. తొలి ఇన్నింగ్స్లో 347 పరుగులు చేసిన హైదరాబాద్.. ప్రత్యర్థిని 216 పరుగులకే ఆలౌట్ చేసింది. ఫస్ట్క్లాస్ అరంగేట్రంలోనే మీడియం పేసర్ రక్షణ్ రెడ్డి 5 వికెట్లు పడగొట్టి అదుర్స్ అనిపించాడు. 131 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించిన హైదరాబాద్.. ధాటిగా ఆడుతూ 269/8 వద్ద రెండో ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. విహారి సెంచరీకి తోడు తిలక్ వర్మ (63; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), తన్మయ్ అగర్వాల్ (49; 7 ఫోర్లు, ఒక సిక్సర్) రాణించారు. 401 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన చండీగఢ్.. మూడో రోజు శనివారం ఆట ముగిసే సమయానికి 21/2తో నిలిచింది. చేతిలో 8 వికెట్లు ఉన్న ఆ జట్టు విజయానికి ఇంకా 380 పరుగులు చేయాల్సి ఉంది.