Fake Mr. Bean | స్టార్ ఆటగాళ్లతో నిండిన పాకిస్థాన్కు జింబాబ్వే షాక్ ఇచ్చింది. గురువారం జరిగిన కీలక మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే జట్టు 8 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పాక్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 129 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో ఒక్క పరుగు తేడాతో జింబాబ్వే చేతిలో పాక్ ఓడిపోయింది. ఈ మ్యాచ్ సందర్భంగా గతంలో జరిగిన మిస్టర్ బీన్ వివాదం ఒకటి తెరపైకి వచ్చింది. ఈ వివాదం పాక్ అభిమానులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యేలా చేసింది.
పాకిస్థాన్ జట్టును చిత్తు చేసిన జింబాబ్వే జట్టుపై ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈనేపథ్యంలో జింబాబ్వే అధ్యక్షుడు ఎమర్సన్ కూడా జింబాబ్వే ఆటగాళ్లకు సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలిపాడు. ‘జింబాబ్వే విజయం అద్భుతం. అభినందనలు చెవ్రాన్స్. వచ్చేసారి నిజమైన మిస్టర్ బీన్ను పంపండి. ‘pakvszim’’అంటూ ట్వీట్ చేశారు.
పాక్ జట్టును హేళన చేసేలా అతను చేసిన పోస్ట్ మాత్రం పాక్ అభిమానలకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. దీంతో ఏకంగా పాక్ ప్రధాని షాబాజ్ షరీఫ్ కూడా జింబాబ్వే అధ్యక్షుడి ట్వీట్పై స్పందించాల్సి వచ్చింది. ‘మా వద్ద అసలైన మిస్టర్ బీన్ ఉండకపోవచచ్చు. కానీ, మా వద్ద అసలైన క్రికెట్ స్ఫూర్తి ఉంది. మా పాకిస్థానీలకు అద్భుతంగా తిరిగిపుంజుకునే అలవాటు ఉంది. మిస్టర్ ప్రెసిడెంట్ అభినందనలు. మీ జట్టు నిజంగా బాగా ఆడింది’ అని సమాధానం ఇచ్చారు.
We may not have the real Mr Bean, but we have real cricketing spirit .. and we Pakistanis have a funny habit of bouncing back 🙂
Mr President: Congratulations. Your team played really well today. 👏 https://t.co/oKhzEvU972
— Shehbaz Sharif (@CMShehbaz) October 27, 2022
మిస్టర్ బీన్ వివాదం ఏంటంటే..?
పాక్- జింబాబ్వే మ్యాచ్ మధ్యలో మిస్టర్ బీన్ రావడానికి ప్రధాన కారణం 2016లో జరిగిన ఓ సంఘటన. 2016 లో జింబాబ్వేలోని హరారేలో జరిగిన అంతర్జాతీయ సమావేశంలో, పాకిస్థాన్కు చెందిన ప్రముఖ హాస్యనటుడు ఆసిఫ్ మహ్మద్తో ఓ కామెడీ షో నిర్వహించారు. ఇతను చూడడానికి నిజమైన మిస్టర్ బీన్ (బ్రిటిష్ యాక్టర్ రోవాన్ ఆట్కిన్సన్)ను పోలి ఉంటాడు. అయితే, హరారేలో జరిగిన షోలో ఇతడి ప్రదర్శన ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. ఈ విషయంపై జింబాబ్వే పత్రిక కూడా అప్పట్లో ఓ కథనం ప్రచురించింది. కొంత మంది షో మధ్య నుంచి వెళ్లిపోయినట్లు పేర్కొంది. అప్పట్లో ఈ ఫేక్ మిస్టర్ బీన్ జింబాబ్వే వీధుల్లో తిరిగేందుకు పోలీసులు రక్షణ కూడా కల్పించారు. అదేవిధంగా చాలా మంది జింబాబ్వే ప్రజలు.. ఇతడు అసలైన మిస్టర్ బీన్గా భావించి ఈవెంట్ టిక్కెట్లు కొన్నట్లు కూడా వార్తలొచ్చాయి.
ఈ సంఘటనకు సంబంధించి పాక్పై ప్రతీకారం తీర్చుకోవాలని జింబాబ్వే ఎప్పటి నుంచో ఎదురుచూస్తోంది. ఈ క్రమంలోనే టీ20 ప్రపంచకప్ మ్యాచ్లో పాక్ ఓడితే ఒక ఆట ఆడుకోవాలని జింబాబ్వే అభిమానులు భావించారు. ఈ క్రమంలో మ్యాచ్కు ముందు పాకిస్థాన్ ప్రాక్టీస్కు సంబంధించిన కొన్ని చిత్రాలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇవి చూసిన జింబాబ్వే అభిమాని ఒకరు రేపటి మ్యాచ్లో బాబర్ టీం ఓడిపోవడం ఖాయం అంటూ.. మిస్టర్ బీన్ అంశాన్ని తెరపైకి తెచ్చాడు. ఒకసారి మీరు మాకు నిజమైన మిస్టర్ బీన్కు బదులుగా నకిలీ పాక్ బీన్ను చూపించారు. రేపటి మ్యాచ్లో మేం దీనిని సెటిల్ చేస్తాం అని ట్వీట్ చేశారు. వారు ఆశించినట్లు బింజాబ్వే జట్టు పాక్పై అద్భుత విజయాన్ని నమోదు చేసింది. దీంతో ఆ ట్వీట్ ట్రెండింగ్లోకి వెళ్లిపోయింది. ఇంకేముంది సోషల్ మీడియాలో పాక్ జట్టుపై ట్రోల్స్ మొదలయ్యాయి. చాలా మంది నెటిజన్లు అదే ట్వీట్ను రీట్వీట్ చేస్తున్నారు.
Pakistan sent fake Mr.Bean & cheated Zimbabwe public
Zimbabwe defeated Pakistan 🏏
Congratulations 👏
pic.twitter.com/Oq9BBMqRkw— narne kumar06 (@narne_kumar06) October 27, 2022