మెరిసిన కుల్దీప్, రాహుల్, సిరాజ్ సొంతగడ్డపై జోరు కొనసాగించిన టీమ్ఇండియా.. మరో సిరీస్ ఖాతాలో వేసుకుంది. పొట్టి ఫార్మాట్లో చక్కటి పోటీనిచ్చిన లంక.. వన్డేల్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. మొదట కట్టుదిట్టమైన బౌలింగ్తో ఆకట్టుకున్న భారత్.. ప్రత్యర్థిని తక్కువ స్కోరుకే ఆలౌట్ చేస్తే.. మిడిలార్డర్ సత్తాచాటడంతో రోహిత్ సేన ఖాతాలో మరో సీరిస్ చేరింది. ఈడెన్ గార్డెన్స్లో పండుగకు ముందే సంబురాలు ప్రారంభించిన టీమ్ఇండియా ఆదివారం నామమాత్రమైన మూడో వన్డేలో లంకను మరోసారి ఢీకొట్టనుంది!
కోల్కతా: సమష్టి ప్రదర్శనతో సత్తాచాటిన భారత జట్టు వన్డే సిరీస్ ఖాతాలో వేసుకుంది. ఇటీవలే టీ20ల్లో లంకేయులను చిత్తుచేసిన టీమ్ఇండియా.. మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్ చేజిక్కించుకుంది. గురువారం ఈడెన్ గార్డెన్స్లో జరిగిన పోరులో రోహిత్ సేన 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక 39.4 ఓవర్లలో 215 పరుగులకు ఆలౌటైంది. అరంగేట్ర ఆటగాడు నువనిండు ఫెర్నాండో (63 బంతుల్లో 50; 6 ఫోర్లు) అర్ధశతకంతో ఆకట్టుకోగా.. కుషాల్ మెండిస్ (34), దునిత్ (32) ఫర్వాలేదనిపించారు. భారత బౌలర్లలో హైదరాబాదీ మహమ్మద్ సిరాజ్, చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ చెరో మూడు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో భారత్ 43.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 219 పరుగులు చేసింది. వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ (103 బంతుల్లో 64 నాటౌట్; 6 ఫోర్లు) అజేయ అర్ధశతకంతో చివరి వరకు క్రీజులో నిలిచి జట్టును
గెలిపించ గా.. అతడికి స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా (36), శ్రేయస్ అయ్యర్ (28) సహకరించారు. లంక బౌలర్లలో లహిరు కుమార, చమిక కరుణరత్నె చెరో రెండు వికెట్లు పడగొట్టారు. యుజ్వేంద్ర చాహల్ స్థానంలో జట్టులో చోటు దక్కించుకున్న కుల్దీప్కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య నామమాత్రమైన మూడో వన్డే ఆదివారం తిరువనంతపురంలో జరుగనుంది.
మిడిల్ మెరుపులు..
సాధారణ లక్ష్యఛేదనలో టీమ్ఇండియాకు చెప్పుకోదగ్గ ఆరంభం లభించలేదు. ఈడెన్ గార్డెన్స్లో లంకపై ఘనమైన రికార్డు ఉన్న రోహిత్ శర్మ (17; 2 ఫోర్లు, ఒక సిక్సర్) క్రీజులో ఉన్నంతసేపు ధాటిగా ఆడినా.. దాన్ని భారీ స్కోరుగా మలచలేకపోయాడు. గత మ్యాచ్లో రాణించిన యువ ఓపెనర్ శుభ్మన్ గిల్ (21; 5 ఫోర్లు) కూడా ఎక్కువసేపు నిలువలేకపోగా.. తొలి వన్డేలో శతక్కొట్టిన మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ (4) విఫలమయ్యాడు. దీంతో ఒక దశలో టీమ్ఇండియా 62 పరుగులకే 3 వికెట్లు కోల్పోగా.. శ్రేయస్ అయ్యర్ , హార్దిక్ పాండ్యా అండతో రాహుల్ ఇన్నింగ్స్ను నడిపించాడు. సాధించాల్సిన రన్రేట్ ఎక్కువ కాకపోవడంతో ఆచితూచి ఆడిన ఈ కర్ణాటక బ్యాటర్.. ఒక్కో పరుగు జోడిస్తూ జట్టును విజయానికి చేరువ చేశాడు. ‘ఐదో స్థానంలో బ్యాటింగ్ చేయడాన్ని ఆస్వాదిస్తా. మ్యాచ్ పరిస్థితులను బట్టే నా బ్యాటింగ్ సాగుతుంది. బయట ఉన్నప్పుడే ఒక అవగాహన వస్తుంది కాబట్టి.. మైదానంలో ప్రశాంతంగా ఆడొచ్చు’అని పోరు అనంతరం రాహుల్ పేర్కొన్నాడు. ఆఖర్లో అక్షర్ పటేల్ (21) ధాటిగా ఆడగా.. లంక బౌలర్లు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్ దక్కడంతో ఆఖరి వన్డేలో భారత్ ప్రయోగాలు చేసే అవకాశం కనిపిస్తున్నది. తన చివరి వన్డేలో డబుల్ సెంచరీ చేసిన యువ ఓపెనర్ ఇషాన్ కిషన్తో పాటు.. లంకతో ఆఖరి టీ20లో అజేయ శతకం బాదిన సూర్యకుమార్ యాదవ్కు తుది జట్టులో చాన్స్ దక్కొచ్చు.
సంక్షిప్త స్కోర్లు
శ్రీలంక: 39.4 ఓవర్లలో 215 ఆలౌట్ (ఫెర్నాండో 50, మెండిస్ 34; సిరాజ్ 3/30, కుల్దీప్ 3/51),
భారత్: 43.2 ఓవర్లలో 219/6 (రాహుల్ 64 నాటౌట్, పాండ్యా 36; చమిక 2/51, లహిరు 2/64).