యువ ప్లేయర్లకు మెరుగైన శిక్షణనిస్తాం
నమస్తే తెలంగాణతో హెచ్ఎఫ్సీ యజమాని వరుణ్ త్రిపురనేని
ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)లో హైదరాబాద్ ఫుట్బాల్ క్లబ్ (హెచ్ఎఫ్సీ) అద్భుత ప్రదర్శనతో అదరగొడుతున్నది. గత సీజన్లకు భిన్నంగా సమిష్టిగా సత్తాచాటుతూ టైటిల్ పోరుకు మరో అడుగు దూరంలో ఉంది. ఎదురైన ప్రత్యర్థిని చిత్తుచేస్తూ తొలిసారి సెమీస్కు అర్హత సాధించిన హెచ్ఎఫ్సీ ఈసారి అంచనాలకు మించి రాణిస్తున్నది. ఈ నేపథ్యంలో హెచ్ఎఫ్సీ యజమాని వరుణ్ త్రిపురనేనిని ‘నమస్తే తెలంగాణ’ పలుకరించగా ఆయన పలు విషయాలు పంచుకున్నారు. తెలంగాణలో ఫుట్బాల్ క్రీడాభివృద్ధికి కృషిచేస్తామని పేర్కొన్న వరుణ్.. ప్రతిభ కల్గిన ప్లేయర్లను తీర్చిదిద్దేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతామని తెలిపారు.
ఫుట్బాల్ అభివృద్ధిపై మీ ప్రణాళిక ఏంటీ?
తెలంగాణలో ప్రతిభ కల్గిన ప్లేయర్లకు కొదువ లేదు. కావాల్సిందల్లా సరైన శిక్షణ. భవిష్యత్ను దృష్టిలో పెట్టుకుని క్యాంప్లు నిర్వహించాలన్న ఆలోచనతో ఉన్నాం. ఇప్పటికే గజ్వేల్లో రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (సాట్స్) సహకారంతో ముందుకు వెళుతున్నాం. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న యువకులపై దృష్టి సారిస్తున్నాం. ఆటపై మక్కువ ఉండి, రాణించాలన్న పట్టుదలతో ఉన్న యువకులను చేరదీసి అత్యుత్తమ శిక్షణ అందిస్తాం. ప్లేయర్లను వయసుల వారీగా విభజించి అందుకు తగ్గట్లు నిపుణులైన కోచ్ల సహకారంతో అంతర్జాతీయ స్థాయి కోచింగ్ ఇచ్చేందుకు ప్రణాళికలు రచిస్తున్నాం. ఈ క్రమంలో హైదరాబాద్ వరకే పరిమితం గాకుండా తెలంగాణలోని మిగతా జిల్లాల్లో కూడా విస్తరించాలన్న ఉద్దేశంతో ఉన్నాం. ఇందుకు ప్రభుత్వ సహకారం తీసుకుంటాం.
ఫుట్బాల్కు ఆదరణ ఎలా ఉంది?
క్రికెట్, కబడ్డీ లాంటి వాటితో పోల్చుకుంటే ఫుట్బాల్కు ఆదరణ తక్కువేమి లేదు. స్కూల్ స్థాయి నుంచే పిల్లలు సాకర్ ఆడేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. అందుకు తల్లిదండ్రులు సరైన ప్రోత్సాహం అందిస్తున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని శిక్షణా శిబిరాలతో పాటు అకాడమీ ఏర్పాటు చేయాలన్న ఆలోచనతో ఉన్నాం. ప్రధాన జట్టుకు ప్రాతినిధ్యం వహించేలా యువకులను తీర్చిదిద్దేందుకు అనుభజ్ఞులైన కోచ్ల సహకారం తీసుకుంటున్నాం.
జట్టు సెమీస్ చేరడంపై మీ స్పందన?
ఈ సీజన్లో హెచ్ఎఫ్సీ సెమీస్ బెర్తు దక్కించుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఓగ్బాచె, జావో విక్టర్, సివేరియాతో పాటు ఆకాశ్ మిశ్రా, అశిష్ రాయ్, గోల్కీపర్ లక్ష్మికాంత్ ఇలా ప్లేయర్లందరూ తమ స్థాయికి తగ్గ ప్రదర్శన కనబరిచారు. ఏటీకేతో బుధవారం జరిగే రెండో సెమీస్లో గెలిచి ఫైనల్లోకి ప్రవేశిస్తామన్న ధీమా ఉంది.