అహ్మదాబాద్: ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ తరఫున విధ్వంసకర బ్యాటింగ్తో చెలరేగి అత్యధిక పరుగులతో ఆరెంజ్ క్యాప్ సాధించిన 15 ఏండ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ క్వాలిఫయర్-2లో జట్టు ఓటమిపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. కీలకమ్యాచ్లో తప్పుడు షాట్ ఆడి వికెట్ పారేసుకోవడంపై స్పందిస్తూ ‘నేనొక తప్పు చేశాను’ అన్నాడు. తాను క్రీజులో మరికొంత సమయం ఉండి ఉంటే ఫలితం వేరేలా ఉండేదన్నాడు. టోర్నీ ముగింపు వేడుకల్లో మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ సహా ఐదు అవార్డులను గెలుచుకున్న ఈ వండర్ కిడ్ మ్యాచ్ పరిస్థితులను బట్టి ఆట తీరును మార్చుకోవడం ఈ సీజన్ ద్వారా తాను నేర్చుకున్న ముఖ్యమైన పాఠమని పేర్కొన్నాడు. తనపై మీడియా ఫోకస్ పెరగడంతో కాస్త ఒత్తిడికి గురయ్యానని చెప్పాడు. మాజీ క్రికెటర్లు తన ఫిట్నెస్పై వ్యక్తపరిచిన సందేహాలపై స్పందిస్తూ అంతర్జాతీయ స్థాయిలో సుదీర్ఘ కాలం పాటు కెరీర్ను కొనసాగించాలన్నా, గాయాల బారిన పడకుండా ఉండాలన్నా ఫిట్నెస్ ఎంతో ముఖ్యమని అతడు అంగీకరించాడు. తాను ఇప్పటికే ఫిజికల్ కండిషనింగ్పై కసరత్తులు ప్రారంభించానని, జట్టులోని సీనియర్ ఆటగాళ్లు, సపోర్ట్ స్టాఫ్ తనకు ఎంతో మద్దతుగా నిలుస్తున్నారని స్పష్టం చేశాడు.