న్యూఢిల్లీ: తీవ్ర ఒడిదొడుకులతో కొట్టుమిట్టాడుతున్న భారత రెజ్లింగ్ సమాఖ్య(డబ్ల్యూఎఫ్ఐ) మరింత ఊబిలోకి కూరుకుపోయింది. నిర్దేశిత గడువులోగా ఎన్నికలు నిర్వహించని కారణంగా డబ్ల్యూఎఫ్ఐపై ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య(యుడబ్ల్యూడబ్ల్యూ) నిరవధిక నిషేధం విధించింది. ఈ కారణంగా వచ్చే నెల 16 నుంచి మొదలయ్యే ప్రతిష్ఠాత్మక ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్షిప్లో భారత రెజ్లర్లు తటస్థ ప్లేయర్లుగా పోటీపడే పరిస్థితి నెలకొంది.
ఇదిలా ఉంటే వాస్తవానికి షెడ్యూల్ ప్రకారం ఈ నెల 12న డబ్ల్యూఎఫ్ఐకి ఎన్నికలు జరుగాల్సింది కానీ హర్యానా రెజ్లింగ్ అసోసియేషన్ కోర్టుకెక్కడంతో ఎన్నికలు వాయిదా పడ్డాయి. లైంగిక ఆరోపణలు ఎదుర్కొన్న మాజీ అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ శరణ్సింగ్ను తప్పిస్తూ ఏప్రిల్ 27న ఐవోఏ అడ్హక్ ప్యానెల్ ఏర్పాటు చేసింది. 45 రోజుల్లోగా ఎన్నికలు జరుపాల్సిందిగా యూడబ్ల్యూడబ్ల్యూ హెచ్చరించినా..డబ్ల్యూఎఫ్ఐ పెడచెవిన పెట్టడం నిషేధానికి కారణమైంది.