IPL 2024 : భారత స్టార్ వికెట్ కీపర్ రిషభ్ పంత్(Rishabh Pant) పునరాగమనం కోసం అభిమానులు ఆతృతగా ఉన్నారు. అందుకు తగ్గట్టే పంత్ ఐపీఎల్ 17వ సీజన్(IPL 2024)తో రీ-ఎంట్రీ ఇచ్చేందుకు ఓ రేంజ్లో చెమటోడ్చుతున్నాడు. ఈమధ్యే మోకాలి సర్జరీ నుంచి కోలుకున్న ఈ డాషింగ్ బ్యాటర్ ఫామ్ కోసం నెట్స్లో గట్టిగానే ప్రాక్టీస్ చేస్తున్నాడు. అయితే.. పంత్ తొందరపడొద్దని, కొంచెం ఆలస్యమైనా పూర్తిగా ఫిట్గా మారాకే పునరాగమనం చేయాలని మాజీలు అభిప్రాయపడుతున్నారు.
భారత మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప(Robin Uthappa) సైతం ఇదే అంటున్నాడు. ‘ఏడాదిన్నరకు పైగా ఆటకు దూరం కావడం ఏ ఆటగాడికైనా కష్టమే. పంత్ ఎంత త్వరగా కోలుకున్నాడనేది అతడి ఫిట్నెస్పై ఆధారపడింది. చాలా రోజులకు పంత్ నెట్స్లో కనపడడం చాలా బాగుంది. అతడు బంతిని బలంగా బాదుతున్నాడు. వికెట్ కీపింగ్ కూడా ప్రాక్టీస్ చేస్తున్నాడు. అయితే.. పంత్ తన పునరాగమనం కోసం తొందరపడొద్దు’ అని ఊతప్ప తెలిపాడు.
పునరామనం తొందరలో పడి పంత్ మళ్లీ గాయపడే చాన్స్ ఉందని రాబిన్ ఊతప్ప ఆందోళన వ్యక్తం చేశాడు. అందుకని పంత్ కొంత సమయం తీసుకుని రీ ఎంట్రీ ఇస్తే బాగుంటుందని అతడు అన్నాడు. అంతేకాదు పంత్ ఎప్పుడు జట్టులోకి వచ్చినా దంచికొట్టుడు ఖాయమని ఊతప్ప తెలిపాడు.
ఐపీఎల్ 17వ సీజన్ మార్చి 22న ప్రారంభం కానుంది. ఈ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్గా పంత్ బరిలోకి దిగుతాడని మెంటార్ సౌరభ్ గంగూలీ ఇప్పటికే తేల్చేశాడు. నిరుడు డేవిడ్ వార్నర్ సారథ్యంలో ఢిల్లీ నిరాశపరిచింది. కెప్టెన్గా వార్నర్ రాణించినా.. కుర్రాళ్లు పృథ్వీ షా, మనీశ్ పాండే, మిచెల్ మార్ష్లు దారుణంగా విఫలమయ్యారు. దాంతో, ఢిల్లీ ప్లే ఆఫ్స్ చేరలేకపోయింది. అందుకని పంత్ వస్తేనే ఢిల్లీ రాత మారుతుందనే ఆలోచనతో మేనేజ్మెంట్ ఉంది.