బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) ఎనిమిదో సీజన్లో శ్రీకాంత్ జాదవ్ (15 పాయింట్లు) విజృంభించడంతో.. యూపీ యోధా రెండో విజయం నమోదు చేసుకుంది. ఆదివారం జరిగిన పోరులో యూపీ యోధా 42-27తో బెంగళూరు బుల్స్పై గెలుపొందింది. యూపీ స్టార్ రైడర్ పర్దీప్ నర్వాల్ విఫలమైనా.. శ్రీకాంత్ చెలరేగడంతో జట్టుకు ఇబ్బంది లేకపోయింది. బెంగళూరు తరఫున భరత్ 11 పాయింట్లు సాధించగా.. కెప్టెన్ పవన్ షెరావత్ (5) స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చలేకపోయాడు. మరో మ్యాచ్లో పుణెరి పల్టన్ 39-27తో బెంగాల్ వారియర్స్పై విజయం సాధించింది. పుణెరి తరఫున అస్లమ్ ఇనామ్దార్ (17) రాణించగా.. బెంగాల్ జట్టులో మణిందర్ (13) టాప్స్కోరర్గా నిలిచాడు.