హైదరాబాద్, ఆట ప్రతినిధి: సుప్రీం కోర్టు నియమించిన సూపర్వైజరీ కమిటీ ..హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ) కార్యకలాపాలను పర్యవేక్షించనుంది. మహమ్మద్ అజారుద్దీన్ నేతృత్వంలోని కార్యవర్గం పదవీకాలం తాజాగా ముగియడంతో నలుగురు సభ్యులతో కూడిన సూపర్వైజరీ కమిటీ సోమవారం భేటీ అయ్యింది. రిటైర్డ్ జస్టిస్ నిస్సార్ అహ్మద్ కక్రూ, అవినీతి నిరోధక శాఖ డీజీ అంజనీకుమార్, మాజీ క్రికెటర్లు వెంకటపతిరాజు, వంకా ప్రతాప్..హెచ్సీఏ వ్యవహారాలపై దృష్టి సారించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా భేటీలో జస్టిస్ కక్రూ మాట్లాడుతూ ‘ఉప్పల్ రాజీవ్గాంధీ స్టేడియం వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య మూడో టీ20 మ్యాచ్ విజయవంతంగా జరిగింది. వాస్తవానికి సుప్రీం కోర్టు..సూపర్వైజరీ కమిటీ నియమించే సమయానికి హెచ్సీఏ పాలకవర్గం మ్యాచ్ ఏర్పాట్లలో బిజీగా ఉంది. కావున ఆ సమయంలో మేము కలుగజేసుకుంటే నిర్వాహణ ఏర్పాట్లపై కచ్చితంగా ప్రభావం చూపిస్తుంది. అందుకే మ్యాచ్ ముగిసిన తర్వాత భేటీ కావాలనుకున్నాం. రోజంతా పలువురు ప్రతినిధులు, పాలకవర్గ సభ్యుల నివేదికలను నిశితంగా పరిశీలించాం. కొందరు రాత రూపంలో అందజేస్తే.. మరికొందరు కొన్ని అంశాలపై మాట్లాడారు. వాటిన్నింటినీ రికార్డు చేస్తు న్నాం. అక్టోబర్ 3న అన్ని విషయాలు వెల్లడిస్తాం’ అని అన్నారు.