(దక్షిణాఫ్రికా): అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) తొలిసారి ప్రవేశపెడుతున్న అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్నకు నేడు తెరలేవనుంది. పురుషుల విభాగంలో 1988 నుంచి అండర్-19 ప్రపంచకప్ నిర్వహిస్తున్న ఐసీసీ.. గత కొన్నాళ్లుగా బాలికలకు ప్రత్యేక టోర్నీ ప్రవేశ పెట్టేందుకు కసరత్తులు చేసింది. షెడ్యూల్ ప్రకారం రెండేండ్ల క్రితమే తొలి మహిళల అండర్-19 ప్రపంచకప్ జరుగాల్సి ఉన్నా.. కరోనా వైరస్ విజృంభణతో ఆలస్యమైంది. ఈ మెగాటోర్నీలో ఐసీసీ శాశ్వత సభ్యదేశాలు 11తో పాటు మరో ఐదు జట్లు కలిపి మొత్తం 16 టీమ్లు పాల్గొంటున్నాయి. దక్షిణాప్రికా వేదికగా జరుగుతున్న ఈ వరల్డ్కప్లో ఆతిథ్య దక్షిణాఫ్రికా, స్కాట్లాండ్, యూఏఈతో కలిసి భారత్ గ్రూప్-‘డి’ నుంచి పోటీ పడుతున్నది. తొలి పోరులో దక్షిణాఫ్రికాతో టీమ్ఇండియా అమీతుమీ తేల్చుకోనుంది. గ్రూప్ దశలో టాప్-3లో నిలిచిన జట్లు.. సూపర్ సిక్స్కు అర్హత సాధిస్తాయి. ఇందులో రెండు గ్రూప్లుగా మ్యాచ్లు నిర్వహిస్తారు. వాటిలో టాప్-2లో నిలిచిన రెండేసి జట్లు సెమీఫైనల్కు చేరుతాయి. ఈ నెల 29న ఫైనల్ జరుగనుంది.
షఫాలీ వర్మ సారథ్యంలో..
తొలిసారి జరుగనున్న ప్రతిష్ఠాత్మక టోర్నీలో సత్తాచాటేందుకు భారత జట్టు సమాయత్తమైంది. మెరికల్లాంటి అమ్మాయిలతో నిండిన టీమ్ఇండియాకు షఫాలీ వర్మ కెప్టెన్గా వ్యవహరించనుంది. ఇప్పటికే భారత మహిళల జట్టు తరఫున ఎన్నో కీలక ఇన్నింగ్స్లు ఆడి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించుకున్న ఈ యువ ఓపెనర్.. విజృంభిస్తే భారత్కు తిరుగులేనట్లే. దేశవాళీల్లో నిలకడగా రాణిస్తున్న తెలంగాణ యువ ఆల్రౌండర్ గొంగిడి త్రిషతో పాటు రిచా ఘోష్ కూడా కీలకం కానున్నారు. మెరుపు బ్యాటింగ్కు పెట్టింది పేరైన ఈ ముగ్గురు సత్తాచాటితే టీమ్ఇండియా కప్పు కొట్టడం ఖాయమే. ఆంధ్ర అమ్మాయి మహమ్మద్ షబ్నమ్ బౌలింగ్లో కీలకం కానుంది. చిన్న వయసులోనే అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టి.. అసమాన ప్రతిభతో ఎన్నో ఘనతలు తన పేరిట లిఖించుకున్న మహిళా క్రికెట్ దిగ్గజం మిథాలీరాజ్ అడుగుజాడల్లో నడుస్తూ మన అమ్మాయిలు చాంపియన్స్గా నిలువాలని ఆశిద్దాం.
మన అమ్మాయిలకు టైటిల్ నెగ్గే సత్తా ఉంది. బౌలింగ్, బ్యాటింగ్లో చక్కటి నైపుణ్యం ఉన్న ప్లేయర్లు అందుబాటులో ఉన్నారు. మహిళల కోసం తొలిసారి అండర్-19 ప్రపంచకప్ నిర్వహించడం ఆనందంగా ఉంది. ఇది యువ క్రీడాకారిణులకు ఎంతగానో ఉపయోగపడుతుంది’
– సచిన్ టెండూల్కర్