కొండలు గుట్టలు ఎక్కి రాటుదేలిన కండరాలతో.. బంతి వేయకముందే ప్రత్యర్థిని భయపెట్టే హవభావాలతో.. గంటకు 150 కిలోమీటర్లకుపై వేగంతో.. ఐపీఎల్లో అందరి దృష్టిని ఆకర్శించిన జమ్ము కశ్మీర్ పేసర్ ఉమ్రాన్ మాలిక్కు జాతీయ జట్టు నుంచి పిలుపు వచ్చింది. డెత్ ఓవర్స్లో యార్కర్స్తో విజృంభించిన పంజాబ్ పేసర్ అర్శ్దీప్ సింగ్ను కూడా దక్షిణాఫ్రికా సిరీస్కు ఎంపిక చేసిన సెలెక్టర్లు.. సారథిగా నియమిస్తారనుకున్న శిఖర్ ధవన్కు మాత్రం మొండిచేయి చూపెట్టారు. ఐపీఎల్లో అదరగొడుతున్న దినేశ్ కార్తీక్, హార్దిక్ పాండ్యా తిరిగి జాతీయ జట్టులో చోటు దక్కించుకోగా.. ఎన్నో ఆశలు పెట్టుకున్న తెలంగాణ కుర్రాడు తిలక్ వర్మ, రాహుల్ త్రిపాఠికి నిరాశ తప్పలేదు!
న్యూఢిల్లీ: మెరుపు వేగంతో ఆకట్టుకుంటున్న జమ్ము కశ్మీర్ ఎక్స్ప్రెస్ ఉమ్రాన్ మాలిక్.. జాతీయ జట్టులోకి వచ్చేశాడు. ఐపీఎల్ 15వ సీజన్లో నిలకడగా గంటకు 150 కిలోమీటర్ల పైగా వేగంతో బంతులు విసురుతూ అందరి మన్ననలందుకున్న ఉమ్రాన్ను.. సెలెక్టర్లు వచ్చే నెల దక్షిణాఫ్రికాతో సొంతగడ్డపై జరుగనున్న ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్కు ఎంపిక చేశారు. ఉమ్రాన్తో పాటు పంజాబ్ కింగ్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్న లెఫ్టార్మ్ పేసర్ అర్శ్దీప్ సింగ్కు కూడా సెలెక్షన్ కమిటీ నుంచి పిలుపు వచ్చింది. ఇంగ్లండ్తో ఏకైక టెస్టుతో పాటు పరిమిత ఓవర్ల సిరీస్లు ఆడేందుకు భారత జట్టు వచ్చే నెల 15న లండన్ బయలు దేరనున్న నేపథ్యంలో మూడు ఫార్మాట్లలో ఆడుతున్న ఆటగాళ్లకు సెలెక్టర్లు విశ్రాంతినిచ్చారు. దీంతో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీని సఫారీ సిరీస్కు పరిగణనలోకి తీసుకోలేదు. ఇంగ్లండ్తో ఏకైక టెస్టు కోసం ప్రకటించిన 17 మంది జట్టులో పెద్దగా సంచలనాలకు అవకాశమివ్వని సెలెక్టర్లు.. ఫామ్లేమితో జట్టులో చోటు కోల్పోయిన సీనియర్ బ్యాటర్ చతేశ్వర్ పుజారాను తిరిగి ఎంపిక చేశారు. ఐపీఎల్లో ఏ జట్టు పుజారాను కొనుగోలు చేసుకోకపోవడంతో ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకునేందుకు కౌంటీ క్రికెట్లో అడుగుపెట్టిన అతడు.. ససెక్స్ తరఫున పరుగుల వరద పారించాడు. 34 ఏండ్ల పుజారా రెండు మ్యాచ్ల్లో రెండు డబుల్ సెంచరీల సాయంతో 720 పరుగులు చేశాడు. దీంతో సెలెక్టర్లు అతడిని తిరిగి జట్టులోకి తీసుకున్నారు. మరో సీనియర్ ప్లేయర్ అజింక్యా రహానే, మయాంక్ అగర్వాల్కు మొండిచేయి తప్పలేదు.
దినేశ్ కార్తీక్, హార్దిక్ పాండ్యాకు పిలుపు..
గతేడాది టీ20 ప్రపంచకప్ తర్వాత జట్టుకు దూరమైన స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా.. తాజా ఐపీఎల్లో గుజరాత్ సారథిగా ఆకట్టుకుంటుండటంతో సెలెక్టర్లు అతడిని దక్షిణాఫ్రికాతో సిరీస్కు ఎంపిక చేశారు. వచ్చే నెల 9 నుంచి ప్రారంభం కానున్న ఈ సిరీస్ కోసం చేతన్ శర్మ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ ఆదివారం 18 మందితో కూడిన జట్టును ప్రకటించగా.. ఇందులో ఉమ్రాన్ మాలిక్, అర్శ్దీప్ సింగ్ తొలిసారి చోటు దక్కించుకున్నారు. ఇక సారథిగా ఎంపిక చేస్తారేమో అనుకున్న శిఖర్ ధవన్కు అసలు జట్టులో చోటే దక్కకపోగా.. తన పవర్ఫుల్ హిట్టింగ్తో మ్యాచ్లను ముగిస్తూ ఫినిషర్గా గుర్తింపు తెచ్చుకున్న దినేశ్ కార్తీక్పై సెలెక్టర్లు నమ్మకముంచారు. స్పిన్ విభాగంలో ‘కుల్చా’ జోడీ కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్తో పాటు మరో మణికట్టు స్పిన్నర్ రవి బిష్ణోయ్, అక్షర్ పటేల్ చోటు దక్కించుకున్నారు. బుమ్రా, షమీ గైర్హాజరీలో భువనేశ్వర్ను ప్రధాన పేసర్గా ఎంపిక చేసిన కమిటీ.. హర్షల్ పటేల్, అవేశ్ ఖాన్, అర్శ్దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్కు ఈ విభాగంలో చోటిచ్చింది.
తిలక్కు చుక్కెదురు
వేలానికి ముందే సన్రైజర్స్ హైదరాబాద్ అట్టి పెట్టుకున్న ఉమ్రాన్ మాలిక్.. ఈ సీజన్లో అద్వితీయ ప్రదర్శన కనబర్చి సెలెక్టర్లను ఆకర్షించాడు. ఆరంభంలో కేవలం పేస్ మీద మాత్రమే దృష్టి పెట్టిన అతడు.. లీగ్ సాగుతున్నా కొద్ది కచ్చితత్వంతో బంతులు వేస్తూ విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. స్టెయిన్ వంటి దిగ్గజ పేసర్ రైజర్స్ బౌలింగ్ కోచ్గా ఉండటం కూడా ఉమ్రాన్ మెరుగయ్యేందుకు దోహదపడింది. వెరసి తొలిసారి జాతీయ జట్టు తరఫున పిలుపందుకున్న ఉమ్రాన్.. బ్లూ జెర్సీలో ఎలాంటి ప్రదర్శన చేస్తాడో చూడాలి. లక్నో సూపర్ జెయింట్స్ పేసర్ మొహసిన్ ఖాన్ గురించి కూడా సెలెక్షన్లో చర్చ జరిగినా.. గాయం అతడిని వెనక్కి లాగింది. ఇక ప్రస్తుత ఐపీఎల్ సీజన్ డెత్ ఓవర్లలో చక్కటి యార్కర్లతో ఆకట్టుకున్న పంజాబ్ పేసర్ అర్శ్దీప్ సింగ్పై సెలెక్టర్లు నమ్మకముంచారు. గతంలో నెట్ బౌలర్లుగా జట్టుతో కొనసాగిన వీరిద్దరూ ఇక అసలు పోరుకు సిద్ధమవుతున్నారు. సన్రైజర్స్కు ప్రాతినిధ్యం వహిస్తూ నిలకడగా రాణించిన త్రిపాఠితో పాటు తెలంగాణ కుర్రాడు తిలక్ను సెలెక్టర్లు పరిగణలోకి తీసుకోలేదు.
తిలక్కు తప్పని నిరాశ..
అండర్-19 స్థాయి నుంచి నిలకడే ప్రధాన ఆయుధంగా ముందుకు సాగుతున్న తెలంగాణ ఆల్రౌండర్ ఠాకూర్ తిలక్ వర్మకు నిరాశ తప్పలేదు. తాజా ఐపీఎల్ సీజన్లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడుతున్న ఈ 19 ఏండ్ల కుర్రాడు.. 14 మ్యాచ్ల్లో 397 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. అన్క్యాప్డ్ ప్లేయర్స్లో ఈ ఏడాది అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఐదుసార్లు చాంపియన్ ముంబై ఇండియన్స్ ఈ సీజన్లో పెద్దగా ఆకట్టుకోలేకపోవడంతో.. తిలక్ ప్రతిభ వెలుగులోకి రాకపోయినా.. టీమ్ఇండియా మూడు ఫార్మాట్ల కెప్టెన్ రోహిత్ శర్మ అతడి ఆటతీరుపై ప్రశంసలు కురిపించాడు. తిలక్ నైపుణ్యమున్న ఆటగాడని.. మూడు ఫార్మాట్లలోనూ భారత్కు ప్రాతినిధ్యం వహించే సత్తా అతడిలో ఉందని పేర్కొన్నాడు. ఈ మాటలు అక్షర సత్యాలని బ్యాటింగ్ దిగ్గజం సునీల్ గవాస్కర్ కూడా ఏకీభవించాడు. అయినా సెలెక్టర్లు మాత్రం అతడికి అవకాశం ఇవ్వలేదు!
టెస్టు జట్టు: రోహిత్ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), గిల్, కోహ్లీ, పుజారా, శ్రేయస్, విహారి, పంత్, భరత్, జడేజా, అశ్విన్, శార్దూల్, షమీ, బుమ్రా, సిరాజ్, ఉమేశ్, ప్రసిద్ధ్ కృష్ణ.
టీ20 జట్టు: కేఎల్ రాహుల్ (కెప్టెన్), గైక్వాడ్, ఇషాన్, దీపక్ హుడా, శ్రేయస్, పంత్, దినేశ్ కార్తీక్, హార్దిక్, వెంకటేశ్, చాహల్, కుల్దీప్, అక్షర్, రవి బిష్ణోయ్, భువనేశ్వర్, హర్షల్ పటేల్, అవేశ్ ఖాన్, అర్శ్దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్.