అండర్-19 ఆసియా కప్ ఫైనల్స్లో భారత జట్టు అదరగొట్టింది. దుబాయ్ వేదికగా శ్రీలంకతో జరిగిన ఈ మ్యాచ్లో భారత బౌలర్లు దుమ్ముదులిపారు. దీంతో శ్రీలంక ఆటగాళ్లు పెవిలియన్కు క్యూ కట్టారు. వర్షం కారణంగా ఈ మ్యాచ్ను 38 ఓవర్లకు కుదించారు.
ఈ క్రమంలో నిర్ణీత ఓవర్లు ముగిసేసరికి లంక 9 వికెట్లు కోల్పోయి 106 పరుగులు మాత్రమే చేయగలిగింది. 107 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ అద్భుతంగా ఆడింది.ఓపెనర్ హర్నూర్ సింగ్ (5) తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరినా.. మరో ఓపెనర్ ఆంగ్రిష్ రఘువంశీ (56 నాటౌట్) అర్థశతకంతో చెలరేగాడు. అతనికి షేక్ రషీద్ (31 నాటౌట్) తోడవడంతో భారత ఛేజింగ్ ఎటువంటి తడబాటు లేకుండా సాగింది.
ఇద్దరూ చాలా సంయమనంతో ఆడటంతో లంక బౌలర్లకు వికెట్లు దొరకడమే కష్టంగా మారింది. ఈ క్రమంలో మరోసారి వర్షం కురవడంతో భారత ఇన్నింగ్స్ను 32 ఓవర్లకు కుదించారు. లక్ష్యాన్ని కూడా 104 పరుగులకు తగ్గించారు. అయితే రషీద్, రఘువంశీ ఇద్దరూ లంక బౌలర్లకు ఎటువంటి అవకాశం ఇవ్వలేదు. వీళ్లిద్దరూ రాణించడంతో భారత జట్టు 21.3 ఓవర్లలోనే టార్గెట్ ఛేజ్ చేసింది. మరో 63 బంతులుండగానే 9 వికెట్లతో ఘనవిజయం సాధించింది.