సహచర ఆటగాడు గాయపడటంతో అనుకోకుండా జట్టులో చోటు దక్కించుకున్న ఆ యువ ఆటగాడు.. అదిరిపోయే ప్రదర్శనతో ఐదు వికెట్లు పడగొట్టి భళా అనిపించుకున్నాడు! వేగానికి కచ్చితత్వాన్ని జోడిస్తూ అతడు సంధించే బంతులు ఎదుర్కోవాలంటే మేటి బ్యాటర్లు సైతం తడబడాల్సిందే. ఆ వేగమే అతడికి భారత అండర్-19 జట్టులో చోటు దక్కేలా చేసింది. ఈ నెలాఖరున యూఏఈ వేదికగా జరుగనున్న జూనియర్ ఆసియా కప్లో పాల్గొనే భారత జట్టుకు ఎంపికైన హైదరాబాద్ పేసర్ రిషిత్ రెడ్డి.. మెరుగైన ప్రదర్శనతో సీనియర్ జట్టు తలుపు తట్టాలని భావిస్తున్నాడు! మహమ్మద్ సిరాజ్ బాటలో టీమ్ఇండియాకు ప్రాతినిధ్యం వహించాలని కలలు కంటున్న నయా ఎక్స్ప్రెస్ రిషిత్ రెడ్డితో స్పెషల్ చిట్చాట్..
ఇటీవల బంగ్లాదేశ్తో జరిగిన ముక్కోణపు సిరీస్లో ఓ పేస్ బౌలర్ గాయపడటంతో రిషిత్ రెడ్డికి భారత అండర్-19 జట్టులో చోటు దక్కింది. అంది వచ్చిన అవకాశాన్ని రెండు చేతులా పొదివి పట్టుకున్న ఈ యువ బౌలర్ ఆడిన తొలి మ్యాచ్లోనే 5 వికెట్లు తీసి అదుర్స్ అనిపించుకున్నాడు. దీంతో ఈ నెల 23 నుంచి యూఏఈ వేదికగా జరుగనున్న జూనియర్ ఆసియా కప్ టోర్నీకి ఎంపిక చేసిన భారత జట్టులో చోటు దక్కించుకున్నాడు. హైదరాబాద్ తరఫున నిలకడగా రాణిస్తున్న కుడిచేతి వాటం పేసర్ రిషిత్.. తాజా సీజన్లో ఆడిన ఆరు మ్యాచ్ల్లో 13 వికెట్లు పడగొట్టడంతో పాటు 120 పరుగులు చేశాడు. ఆసియా కప్నకు ఎంపికవడం సంతోషంగా ఉందంటున్న రిషిత్ రెడ్డి పంచుకున్న విశేషాలు..
బంగ్లాదేశ్తో సిరీస్ సమయంలోనే ఓ పేసర్ గాయపడటంతో అండర్-19 జట్టులో చోటు దక్కింది. అరంగేట్ర మ్యాచ్లోనే ఐదు వికెట్లు పడగొట్టా. ఆ ప్రదర్శన సంతృప్తినిచ్చినా.. ఆసియా కప్లాంటి ప్రతిష్ఠాత్మక టోర్నీకి ఎంపికవుతానని ఊహించలేదు. చాలా ఆనందంగా ఉంది. ఈ ప్రదర్శనను ఇలాగే కొనసాగిస్తూ.. జట్టులో కీలక ఆటగాడిలా ఎదగాలనుకుంటున్నా.
హైదరాబాద్ తరఫున ఆడినప్పుడు ఆల్రౌండర్గానే సేవలందించా. అయితే బంగ్లాతో పోరులో మాత్రం స్పెషలిస్ట్ పేసర్గా ఎంపికయ్యా. దీంతో ఆసియా కప్ కోసం సెలెక్టర్లు నన్ను బౌలర్గానే పరిగణించి ఉంటారు. బౌలింగ్తో పాటు మిడిలార్డర్లో బ్యాటింగ్ చేయగలను. ప్రస్తుత జట్టులో ఐదుగురు పేసర్లు, ఆరుగురు స్పిన్నర్లు, ఇద్దరు వికెట్ కీపర్లు, ఏడుగురు స్పెషలిస్ట్ బ్యాటర్లు ఉన్నారు. హైదరాబాద్ నుంచి నేను ఒక్కడినే ప్రాతినిధ్యం వహిస్తున్నా.
అండర్-19 ఆసియాకప్లో భారత్ ఎప్పుడూ బలమైన జట్టుతోనే బరిలోకి దిగింది. ఈసారి డిఫెండింగ్ చాంపియన్ హోదాలో ఫేవరెట్గా అడుగు పెడుతున్నాం. బంగ్లాదేశ్, పాకిస్థాన్ నుంచి ప్రధాన పోటీ ఎదురయ్యే అవకాశాలున్నాయి. ఇటీవల జరిగిన ముక్కోణపు సిరీస్లో బంగ్లా మెరుగైన ప్రదర్శనతో ట్రోఫీ చేజిక్కించుకుంది. అండర్-19 ప్రపంచకప్ నెగ్గిన జట్టులోని సభ్యులు ఉండటం బంగ్లాకు కలిసొచ్చే అంశం. ఈ నెల 23న టోర్నీ ప్రారంభం కానుండగా.. భారత జట్టు 28న మొదటి మ్యాచ్ ఆడనుంది. పాకిస్థాన్, బంగ్లాదేశ్తో పాటు శ్రీలంక, యూఏఈ, అఫ్గనిస్థాన్, నేపాల్ కూడా పోటీలో ఉన్నాయి.
ఆసియా కప్నకు ఎంపికైన వెంటనే హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్సీఏ) అధ్యక్షుడు మహమ్మద్ అజారుద్దీన్ ట్వీట్ చేయడం ఆనందంగా ఉంది. కోచ్లు రొనాల్డ్ రాడ్రిగస్, గౌస్ బాబా ఎప్పటికప్పుడు నా ప్రదర్శనను మెరుగు పరుస్తూ వచ్చారు. వారి సహకారం వల్లే జాతీయ జట్టుకు ఎంపికయ్యా. మెగాటోర్నీకి ముందు 20 మంది జట్టు సభ్యులతో పాటు ఐదుగురు స్టాండ్బై ఆటగాళ్లతో బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో సన్నాహక శిబిరం నిర్వహించనున్నారు. దీని కోసం శనివారం బయలు దేరుతున్నా.
మా మామ నితేశ్ రెడ్డి అండర్-19 రాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. చిన్నప్పటి నుంచి ఆయన ఆటను అభిమానించే నేను అదే బాటలో క్రికెటర్గా ఎదగాలనుకున్నా. నాన్న శరత్ రెడ్డి వాలీబాల్ ప్లేయర్ కావడంతో బాగా ప్రోత్సహించారు. ఆయన నమ్మకాన్ని నిలబెడుతూ ఈ స్థాయికి చేరా. భవిష్యత్తులో మంచి ఆల్రౌండర్గా ప్రూవ్ చేసుకోవాలని ఉంది. కొండాపూర్లోని ఫయాజ్ అకాడమీలో ప్రాక్టీస్ చేశా. కోచ్ సురేశ్ సార్ ప్రోత్సాహం మరువలేనిది.
చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే పిచ్చి. పదేండ్ల వయసు నుంచే ప్రాక్టీస్ ప్రారంభించా. పద్నాలుగేండ్లు వచ్చే సరికి ఇదే కెరీర్గా మలుచుకోవాలని నిర్ణయించుకున్నా. మంచి ప్రదర్శన కనబర్చడంతో అండర్-14 హైదరాబాద్ జట్టుకు ఎంపికయ్యా. అప్పటి నుంచి చదువుతో పాటు క్రికెట్ను బ్యాలెన్స్ చేసుకుంటూ ఏజ్ గ్రూప్ క్రికెట్లో సత్తాచాటుతున్నా.
న్యూఢిల్లీ: ఈ నెలాఖరులో జరుగనున్న అండర్-19 ఆసియా కప్ కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) శుక్రవారం జట్టును ప్రకటించింది. 20 మంది బృందానికి ఢిల్లీ టాపార్డర్ బ్యాటర్ యశ్ ధుల్ సారథ్యం వహించనుండగా.. ఈ జట్టులో తెలంగాణకు చెందిన యువ పేసర్ రిషిత్ రెడ్డికి చోటు దక్కింది. యూఏఈ వేదికగా డిసెంబర్ 23 నుంచి ఆసియా కప్ ప్రారంభం కానుండగా.. అంతకంటే ముందు భారత కుర్రాళ్లు బెంగళూరులో నిర్వహించనున్న శిక్షణా శిబిరంలో పాల్గొననున్నారు. ‘అండర్-19 ఆసియా కప్ కోసం శరత్ నేతృత్వంలోని ఆల్ఇండియా జూనియర్ సెలెక్షన్ కమిటీ 20 మందితో కూడిన జట్టును ప్రకటించింది. ఈ టోర్నీ ప్రారంభానికి ముందు జట్టుతో పాటు ఎంపిక చేసిన మరో ఐదుగురు స్టాండ్బై ప్లేయర్లతో బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో సన్నాహక శిబిరం నిర్వహిస్తాం’ అని బోర్డు ఓ ప్రకటనలో పేర్కొంది. వినూ మన్కడ్ ట్రోఫీలో ఢిల్లీ తరఫున ఆడిన ఐదు మ్యాచ్ల్లో 75.50 సగటుతో 302 పరుగులు చేసిన యశ్కు కెప్టెన్సీ చాన్స్ దక్కగా.. ఏజ్ గ్రూప్ క్రికెట్లో నిలకడగా రాణిస్తున్న రిషిత్కు జాతీయ జట్టు తరఫున పిలుపు వచ్చింది. గత ఎనిమిది అండర్-19 ఆసియా కప్లలో ఆరింటిని సొంతం చేసుకున్న భారత జట్టు.. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగనుంది.
న్యూఢిల్లీ: ఈ నెలాఖరులో జరుగనున్న అండర్-19 ఆసియా కప్ కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) శుక్రవారం జట్టును ప్రకటించింది. 20 మంది బృందానికి ఢిల్లీ టాపార్డర్ బ్యాటర్ యశ్ ధుల్ సారథ్యం వహించనుండగా.. ఈ జట్టులో తెలంగాణకు చెందిన యువ పేసర్ రిషిత్ రెడ్డికి చోటు దక్కింది. యూఏఈ వేదికగా డిసెంబర్ 23 నుంచి ఆసియా కప్ ప్రారంభం కానుండగా.. అంతకంటే ముందు భారత కుర్రాళ్లు బెంగళూరులో నిర్వహించనున్న శిక్షణా శిబిరంలో పాల్గొననున్నారు. ‘అండర్-19 ఆసియా కప్ కోసం శరత్ నేతృత్వంలోని ఆల్ఇండియా జూనియర్ సెలెక్షన్ కమిటీ 20 మందితో కూడిన జట్టును ప్రకటించింది. ఈ టోర్నీ ప్రారంభానికి ముందు జట్టుతో పాటు ఎంపిక చేసిన మరో ఐదుగురు స్టాండ్బై ప్లేయర్లతో బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో సన్నాహక శిబిరం నిర్వహిస్తాం’ అని బోర్డు ఓ ప్రకటనలో పేర్కొంది. వినూ మన్కడ్ ట్రోఫీలో ఢిల్లీ తరఫున ఆడిన ఐదు మ్యాచ్ల్లో 75.50 సగటుతో 302 పరుగులు చేసిన యశ్కు కెప్టెన్సీ చాన్స్ దక్కగా.. ఏజ్ గ్రూప్ క్రికెట్లో నిలకడగా రాణిస్తున్న రిషిత్కు జాతీయ జట్టు తరఫున పిలుపు వచ్చింది. గత ఎనిమిది అండర్-19 ఆసియా కప్లలో ఆరింటిని సొంతం చేసుకున్న భారత జట్టు.. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగనుంది.
యశ్ ధుల్ (కెప్టెన్), రిషిత్ రెడ్డి, హర్నూర్ సింగ్, రఘువంశీ, అన్ష్, రషీద్, అన్నేశ్వర్ గౌతమ్, సిద్ధార్థ్ యాదవ్, కౌషల్ తాంబె, నిషాంత్ సింధు, దినేశ్, ఆరాధ్య యాదవ్, రాజంగడ్ బవా, రాజ్వర్ధన్, గర్వ్ సాంగ్వాన్, రవి కుమార్, మానవ్ ప్రకాశ్, అమృత్ రాజ్ ఉపాధ్యాయ్, విక్కీ ఓస్తాల్, వాసు.