బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) ఎనిమిదో సీజన్లో తెలుగు టైటాన్స్కు ఏదీ కలిసి రావడం లేదు. ఇప్పటి వరకు సీజన్లో ఒక్క విజయం కూడా సాధించలేకపోయిన టైటాన్స్.. వరుసగా మూడో ఓటమితో పరాజయాల ‘హ్యాట్రిక్’ నమోదు చేసుకుంది. శనివారం జరిగిన పోరులో తెలుగు టైటాన్స్ 38-48తో యూ ముంబా చేతిలో ఓడింది. తొలిసారి తుది జట్టులో చోటు దక్కించుకున్న పాలమూరు రైడర్ గల్ల రాజు (8 పాయింట్లు) చక్కటి ప్రదర్శన కనబర్చడం సానుకూలాంశం. మిగిలిన ఆటగాళ్లతో పోల్చుకుంటే రాజు తక్కువ సమయమే కోర్టులో ఉన్నప్పటికీ.. టైటాన్స్ తరఫున అత్యధిక పాయింట్లు సాధించి అదుర్స్ అనిపించాడు. 10 రైడ్లు చేసి 8 పాయింట్లు ఖాతాలో వేసుకున్నాడు. రాకేశ్ (7), అంకిత్ (6), షిహాస్ (5) ఫర్వాలేదనిపించారు. యూ ముంబా తరఫున అభిషేక్ సింగ్ (13) సూపర్-10 సాధించాడు. ఇప్పటి వరకు లీగ్లో ఏడు మ్యాచ్లు ఆడిన టైటాన్స్కు ఇది ఐదో పరాజయం కాగా.. ప్రస్తుతం 10 పాయింట్లతో పట్టిక అట్టడుగున ఉంది. మరో మ్యాచ్లో దబంగ్ ఢిల్లీ 37-33తో యూపీ యోధాపై విజయం సాధించింది. ఢిల్లీ స్టార్ నవీన్ కుమార్ 18 పాయింట్లతో సత్తాచాటగా.. యూపీ తరఫున పర్దీప్ నర్వాల్, సురేందర్ గిల్ చెరో 9 పాయింట్లు సాధించారు. ఆఖరి పోరులో పట్నా పైరెట్స్ 27-26తో గుజరాత్ జెయింట్స్పై విజయం సాధించింది.