పదేండ్ల అమ్మాయి ప్రతిభపై నమ్మకంతో ఉన్న ఊరిని, సొంత ఇంటిని వదిలి నగరానికి వలస వచ్చిన ఆ తండ్రి త్యాగానికి ఫలితం దక్కింది. ఆట తప్ప మరో లోకం తెలియని ఆమె పట్టువదలని తత్వానికి సెలెక్షన్ కమిటీ సలాం కొట్టింది. ప్రత్యర్థితో పనిలేకుండా బరిలోకి దిగిన ప్రతిసారి పరుగుల వరద పారించడమే తెలిసిన ఆ అమ్మాయికి ప్రపంచకప్ జట్టులో చోటు దక్కింది. వచ్చే ఏడాది దక్షిణాఫ్రికాలో జరుగనున్న అండర్-19 టీ20 వరల్డ్కప్ బరిలోకి దిగనున్న భారత జట్టుకు తెలంగాణ యువకెరటం గొంగడి త్రిష ఎంపికైంది. యువ ఓపెనర్ షఫాలీ వర్మ సారథ్యంలో మెగాటోర్నీ కోసం ఆలిండియా మహిళల సెలక్షన్ కమిటీ 15 మందితో కూడిన జట్టును ప్రకటించగా.. హైదరాబాద్కు చెందిన మరో ప్లేయర్ యశశ్రీ స్టాండ్బైగా ఎంపికైంది.
న్యూఢిల్లీ: జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నిలకడగా రాణిస్తున్న తెలంగాణ యంగ్ గన్ గొంగడి త్రిషకు.. అండర్-19 టీ20 ప్రపంచకప్లో బరిలోకి దిగే భారత మహిళల జట్టులో చోటు దక్కింది. స్వదేశంలో న్యూజిలాండ్ అమ్మాయిలతో జరుగుతున్న సిరీస్లో దుమ్మురేపుతున్న 17 ఏండ్ల త్రిష.. వచ్చే ఏడాది జనవరిలో దక్షిణాఫ్రికా వేదికగా జరుగనున్న మెగాటోర్నీకి ఎంపికైంది. పదమూడేండ్ల వయసులోనే అండర్-19 జట్టుకు ప్రాతినిధ్యం వహించి అద్వితీయ ప్రదర్శన కనబర్చిన త్రిష.. వరల్డ్కప్లో మెరుగ్గా రాణించి తెలంగాణ కీర్తి పతాకాన్ని రెపరెపలాడిస్తానని ధీమా వ్యక్తం చేసింది. మెగాటోర్నీ కోసం ఆలిండియా మహిళల సెలెక్షన్ కమిటీ సోమవారం 15 మందితో కూడిన జట్టును ప్రకటించింది. ఇందులో త్రిషతో పాటు ఆంధ్ర అమ్మాయి మహమ్మద్ షబ్నమ్ చోటు దక్కించుకోగా.. హైదరాబాద్కు చెందిన యశశ్రీ స్టాండ్బై ప్లేయర్గా ఎంపికైంది.
షఫాలీ వర్మ సారథ్యంలో..
సీనియర్ స్థాయిలో భారత జాతీయ జట్టు తరఫున రెండు టెస్టులు, 21 వన్డేలు, 46 టీ20లు ఆడిన షఫాలీ వర్మ సారథ్యంలో భారత అండర్-19 జట్టు వరల్డ్ కప్ బరిలోకి దిగనుంది. వీరేంద్ర సెహ్వాగ్ వారసురాలిగా విధ్వంసక ఓపెనింగ్తో ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్లో తనదైన ముద్ర వేసిన షఫాలీ.. మెగాటోర్నీలో జట్టును ఎలా నడిపిస్తుందో చూడాలి. 16 జట్లు పోటీపడుతున్న వరల్డ్కప్లో ఆతిథ్య దక్షిణాఫ్రికా, యూఏఈ, స్కాట్లాండ్తో కలిసి భారత్ గ్రూప్-‘డి’లో ఉంది. నాలుగు గ్రూప్ల్లో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన జట్లు.. సూపర్ సిక్స్కు అర్హత సాధించనున్నాయి. అందులో టాప్-2 జట్లు సెమీస్లో తలపడతాయి. వచ్చే ఏడాది జనవరి 29న ఫైనల్ జరుగనుంది. ప్రపంచకప్ ప్రారంభానికి ముందు భారత జట్టు దక్షిణాఫ్రికాతో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడనుండగా.. దీని కోసం సెలెక్షన్ కమిటీ 18 మందితో కూడిన జట్టును ప్రకటించింది. అందులోనూ త్రిష చోటు దక్కించుకుంది.
అండర్-19 మహిళల ప్రపంచకప్ భారత జట్టు
షఫాలీ వర్మ (కెప్టెన్), శ్వేత, రిచా ఘోష్, గొంగడి త్రిష, సౌమ్య, సోనియా, హర్లీ, హృషిత, సోనమ్, మన్నత్, అర్చన, పర్షవి, టిటాస్ సాధు, ఫలక్, షబ్నమ్. స్టాండ్బై: శిఖ, నజ్లా, యశశ్రీ.