లండన్: ఇంగ్లండ్ టూర్ కోసం వెళ్లిన టీమిండియా గురువారం మధ్యాహ్నం లండన్లో ల్యాండైంది. ఈ విషయాన్ని స్టార్ బ్యాట్స్మన్ కేఎల్ రాహుల్ తన ఇన్స్టాగ్రామ్లో వెల్లడించాడు. టచ్డౌన్ అంటూ విమానం దిగిన తర్వాత తన లగేజీతో ఉన్న ఫొటోను రాహుల్ షేర్ చేశాడు. ఇండియన్ మెన్స్, వుమెన్స్ టీమ్స్ రెండూ బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ప్రత్యేక చార్టర్డ్ ఫ్లైట్లో ఇంగ్లండ్కు బయలుదేరిన విషయం తెలిసిందే. సుదీర్ఘ పర్యటన కావడంతో క్రికెటర్లు వారి కుటుంబ సభ్యులను తీసుకెళ్లడానికి బీసీసీఐ, అటు ఇంగ్లండ్ ప్రభుత్వం కూడా అనుమతించింది.
మరోవైపు గత మే నెలలో అత్యవసరంగా అపెండిసైటిస్ సర్జరీ చేయించుకున్న కేఎల్ రాహుల్ తిరిగి పూర్తి ఫిట్నెస్ సాధించడంతో ఇంగ్లండ్ టూర్కు ఎంపిక చేశారు. ఐపీఎల్ సందర్భంగానే హోటల్లో ఉన్న సమయంలో రాహుల్కు కడుపునొప్పి రావడంతో అతనికి అపెండిసైటిస్ సర్జరీ చేశారు. ఇంగ్లండ్ టూర్లో భాగంగా టీమిండియా వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్లో న్యూజిలాండ్తో తలపడటంతోపాటు ఇంగ్లండ్తో ఐదు టెస్టులు ఆడనుంది.