టోక్యో: ఒలింపిక్స్ ( Olympics ) ప్రతి నాలుగేళ్లకోసారి వస్తుంటాయ్.. పోతుంటాయ్.. వచ్చిన ప్రతిసారీ మనకు ఎన్ని పతకాలు వస్తాయి? ఈసారైనా ఇండియా తలరాత మారుతుందా అని ఆతృతగా ఎదురు చూడటం.. తర్వాత ఉసూరుమనడం మనకు అలవాటైపోయింది. కానీ ఈసారి టోక్యోకు ఎన్నడూ లేనంత పెద్ద టీమ్ వెళ్తుంటే.. మళ్లీ ఆశలు చిగురించాయి. ఈసారి మన ఆర్చర్లు, షూటర్ల గురి తప్పదు. పతకాల పంట గ్యారెంటీ అని అనుకున్నాం. కానీ చివరికి మెడల్ పక్కా అనుకున్న ఈవెంట్స్లో చేతులెత్తేస్తే.. అసలు అంచనాలు లేని వాళ్లు మెడల్స్ తీసుకొచ్చారు. మొత్తానికి ఏడు మెడల్స్తో టోక్యో ఒలింపిక్స్లో టీమిండియా సూపర్హిట్ అయింది. తొలి రోజు సిల్వర్తో మొదలుపెట్టి.. చివరి రోజు ఏకంగా చరిత్రాత్మక గోల్డ్తో ముగించింది.
లండన్ను దాటేసింది
అమెరికా, చైనాలాంటి దేశాలు ఒలింపిక్స్లో మూడంకెల పతకాలను కూడా అలవోకగా కొట్టేస్తున్నా.. వంద కోట్లకుపైగా జనాభా ఉన్న ఇండియా ఇప్పటి వరకూ ఈ గేమ్స్లో సాధించిన అత్యధిక పతకాల సంఖ్య ఆరు మాత్రమే. 2012లో లండన్ గేమ్స్లో క్రియేట్ చేసిన ఆ రికార్డును ఇప్పుడు 7 మెడల్స్తో టోక్యోలో అధిగమించింది. లండన్లో రెజ్లర్ సుశీల్ కుమార్ సిల్వర్, మరో రెజ్లర్ యోగేశ్వర్ దత్ బ్రాంజ్, షూటర్ విజయ్కుమార్ సిల్వర్, మరో షూటర్ గగన్ నారంగ్ బ్రాంజ్, బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్, బాక్సర్ మేరీకోమ్ బ్రాంజ్ మెడల్స్ గెలిచారు. అయితే 2016లో ఈ మెడల్స్ సంఖ్య మరింత పెరుగుతాయి అనుకుంటే మనవాళ్లు తీవ్రంగా నిరాశపరిచారు. కేవలం రెండే మెడల్స్(సింధుకి సిల్వర్, సాక్షి మాలిక్కు బ్రాంజ్)తో తిరిగొచ్చారు.
తొలిరోజే మురిపించి..
టోక్యోలో మాత్రం మరోసారి మన అథ్లెట్లు మురిపించారు. తాను మోయాల్సిన బరువుతోపాటు కోట్లాది మంది ఆశల భారాన్ని కూడా విజయవంతంగా మోసి టోక్యోలో తొలిరోజే సిల్వర్ మెడల్తో మురిపించింది వెయిట్లిఫ్టర్ మీరాబాయి చాను. 2016 రియో గేమ్స్లో నిరాశపరిచిన ఆమె.. ఈసారి తనపై ఉన్న ఆశలను వమ్ము కానీయలేదు. 48 కేజీల కేటగిరీలో పాల్గొన్న ఆమె స్నాచ్, క్లీన్ అండ్ జెర్క్ కలిపి 202 కేజీలు ఎత్తి సిల్వర్ మెడల్ సొంతం చేసుకుంది.
గురితప్పిన షూటర్లు, ఆర్చర్లు
తొలిరోజే మెడల్. ఈసారి శకునం బాగున్నట్లుంది అనుకున్నారు. ఆర్చర్లు, షూటర్లు బరిలోకి దిగుతున్నారు. ఇక పతకాల పండగే అనీ భావించారు. వరల్డ్కప్ విన్నర్లు, వరల్డ్ నంబర్ వన్లు, చాంపియన్లు వీళ్లలో ఉన్నారు. కానీ ఆర్చర్లు, షూటర్లు దారుణంగా విఫలమయ్యారు. ఆర్చరీలో దీపికా కుమారి, అతాను దాస్, ప్రవీణ్ జాదవ్ నిరాశ పరచగా.. షూటింగ్లో మను బాకర్, ఎలవెనిల్ వలవిరన్, సౌరభ్ చౌదరి, యశస్విని జైశ్వాల్ మెడల్స్కు చాలా దూరంలోనే ఆగిపోయారు. ఇక బాక్సింగ్లో వరల్డ్ నంబర్ వన్ అమిత్ పంగాల్, వికాస్ కృష్ణణ్, రెజ్లింగ్లో వినేశ్ ఫోగాట్ కూడా నిరాశపరిచారు.
ఊహించని విజయాలు
స్టార్లంతా ఒక్కొక్కరుగా వెనుదిరుగుతుంటే.. టోక్యో కూడా మరో రియోలాగా చేదు అనుభవాన్ని మిగులుస్తుందా అన్న దిగులు కోట్లాది మంది అభిమానుల్లో కనిపించింది. కానీ ఎవరూ ఊహించని విజయాలు రాబోతున్నాయని అప్పుడు కనిపెట్టలేకపోయారు. 40 ఏళ్ల మెడల్ కరవును తీరుస్తూ మెన్స్ హాకీ టీమ్ బ్రాంజ్ మెడల్ గెలిచింది. అసలు అంచనాలే లేని బాక్సర్ లవ్లీనా కూడా కాంస్యంతో మురిపించింది. ఓ మెరుపులా వచ్చి ఏకంగా సిల్వర్ మెడల్ ఎగరేసుకుపోయాడు రెజ్లర్ రవి దహియా.
ఈసారి గోల్డ్ పక్కా అని అనుకున్నా బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు చివరికి బ్రాంజ్ మెడల్ అయినా తీసుకొచ్చింది. చివరి రోజు మెడల్ హాట్ ఫేవరెట్ భజరంగ్ పూనియా కూడా బ్రాంజ్తో పరువు కాపాడుకున్నాడు. ఇక వీటన్నింటినీ మించిన ఆనందాన్ని తన ఒక్క త్రోతో అందించాడు జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా. ఇండియాకు మెడల్ ఊసే లేని అథ్లెటిక్స్లో, అదీ ఏకంగా గోల్డ్ మెడలే సాధించి పెట్టి భవిష్యత్తుపై ఎన్నో ఆశలు రేపుతూ టోక్యో గేమ్స్ను ఘనంగా ముగించాడు.
జస్ట్ మిస్
ఈ ఊహించని విజయాలే కాదు.. తృటిలో చేజారిన పతకాలూ ఉన్నాయి. హాకీలో ఎన్నడూ లేని విధంగా తొలిసారి సెమీఫైనల్ చేరి ఆశ్చర్యపరిచిన అమ్మాయిల జట్టు.. ఆ తర్వాత తృటిలో బ్రాంజ్ మెడల్ మిస్సయ్యారు. ఇక చివరి రోజూ వరకూ అనూహ్యంగా గోల్ఫ్లో మెడల్పై ఆశలు రేపిన గోల్ఫర్ అదితి అశోక్.. ఒక్క స్ట్రోక్లో బ్రాంజ్ మెడల్ గెలిచే అవకాశాన్ని చేజార్చుకుంది. తొలి మూడు రోజులూ సిల్వర్ పొజిషన్లో ఉన్న ఆమె.. చివరి రోజు కాస్త తడబడటంతో మెడల్ మిస్సయింది. ఇక తొలిసారి ఫెన్సింగ్కు క్వాలిఫై అయినా తొలి రౌండ్ దాటిన భవానీ దేవి, టేబుల్ టెన్నిస్లో మూడో రౌండ్ వరకూ వెళ్లి ఆశ్చర్యపరిచిన మనికా బాత్రా, శరత్ కమల్.. ఇలా టోక్యో గేమ్స్ ఎలా చూసినా.. టీమిండియాకు భవిష్యత్తుపై ఆశలు రేపేలానే ఉన్నాయి.