వరుస విజయాలతో లంకపై ఇప్పటికే వన్డే సిరీస్ చేజిక్కించుకున్న టీమ్ఇండియా.. క్లీన్స్వీప్ చేసేందుకు రెడీ అయింది. ఈ ఏడాది ఆఖర్లో సొంతగడ్డపై వన్డే ప్రపంచకప్ జరుగనున్న నేపథ్యంలో ఇప్పటి నుంచే అస్త్రశస్ర్తాలు సిద్ధం చేసుకుంటున్న భారత జట్టు.. నామమాత్ర పోరులో బెంచ్ బలాన్ని పరీక్షించే చాన్స్ ఉంది.
తిరువనంతపురం: స్వదేశంలో తిరుగులేని ఫామ్ కొనసాగిస్తున్న టీమ్ఇండియా.. ఆదివారం శ్రీలంకతో మూడో వన్డే ఆడనుంది. తొలి రెండు మ్యాచ్లు నెగ్గి ఇప్పటికే సిరీస్ చేజిక్కించుకున్న రోహిత్ సేన.. ఆఖరి పోరులో ప్రయోగాలు చేయాలని చూస్తున్నది. రోహిత్, గిల్, కోహ్లీ, శ్రేయస్, రాహుల్, పాండ్యాతో బ్యాటింగ్ లైనప్ బలంగా ఉండగా.. బౌలింగ్ విభాగంలో అర్ష్దీప్, వాషింగ్టన్ సుందర్ వంటి వారిని పరీక్షించే చాన్స్ ఉంది. మరో రెండు రోజుల్లోనే న్యూజిలాండ్తో వన్డే సిరీస్ ప్రారంభం కానున్న నేపథ్యంలో.. లంకపై సిరీస్ క్లీన్స్వీప్ చేసి ఆత్మవిశ్వాసం ప్రోది చేసుకోవాలని రోహిత్ సేన భావిస్తున్నది.
బీభత్సమైన ఫామ్లో ఉన్న యువ ఆటగాళ్లు ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ను ఆఖరి మ్యాచ్లో ఆడించే అవకాశాలున్నాయి. ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ సమీపిస్తున్న తరుణంలో పనిభారాన్ని తగ్గించేందుకు సీనియర్ పేసర్ మహమ్మద్ షమీకి రెస్ట్ ఇవ్వాలని మేనేజ్మెంట్ యోచిస్తున్నది. అతడి స్థానంలో అర్ష్దీప్ జట్టులోకి రావొచ్చు. తిరువనంతపురం వికెట్ బ్యాటింగ్, బౌలింగ్కు సమానంగా సహకరించనుండగా.. ఇప్పటికే అక్కడికి చేరుకున్న ఇరు జట్లు శనివారం ప్రాక్టీస్ చేశాయి. మరోవైపు టీ20ల్లో పర్వాలేదనిపించిన శ్రీలంక.. వన్డేల్లో పెద్దగా ప్రతిఘటన చూపలేకపోతున్నది. ఆ జట్టు అన్ని విభాగాల్లోనూ సత్తాచాటాల్సిన అవసరముంది. అయితే దసున్ షనక ఫామ్, వణిండు హసరంగ బౌలింగ్ లంకకు ఉత్సాహాన్నిస్తున్నాయి. మరి ఆఖరి మ్యాచ్లోనైనా లంక గెలుస్తుందా.. లేక మరోసారి భారత జోరుకు దాసోహమంటూ ఉసూరుమనిపిస్తుందా నేడు తేలనుంది.