IND vs WI | స్వల్ప లక్ష్యఛేదనలో తడబడి తొలి టీ20లో విండీస్ చేతిలో పరాజయం పాలైన టీమ్ఇండియా.. రెండో మ్యాచ్లో బలంగా పుంజుకోవాలని చూస్తున్నది. బౌలర్లు సత్తాచాటినా.. బ్యాటింగ్ వైఫల్యంతో మూల్యం చెల్లించుకున్న భారత్ ఈ సారి మరో అదనపు బ్యాటర్ను తీసుకోవాలని భావిస్తున్నది. తెలంగాణ కుర్రాడు తిలక్ వర్మ అరంగేట్రంలోనే అదుర్స్ అనిపించుకోగా.. మరో ఐపీఎల్ హీరో యశస్వి జైస్వాల్కు ఈ మ్యాచ్లో అవకాశం దక్కొచ్చు!
గయానా: వెస్టిండీస్ పర్యటనలో భాగంగా టెస్టు, వన్డే సిరీస్లు చేజిక్కించుకున్న టీమిండియా.. టీ20 సిరీస్లో బోణీ కొట్టేందుకు సిద్ధమైంది. ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా తొలి పోరులో నాలుగు పరుగుల తేడాతో ఓడిన హార్దిక్ సేన.. ఆదివారం జరగనున్న పోరులో నెగ్గి సిరీస్ సమం చేయాలని చూస్తున్నది. మిగిలిన రెండు ఫార్మాట్లతో పోల్చుకుంటే.. టీ20ల్లో విండీస్ జట్టు బలంగా ఉండగా.. టీమ్ఇండియాలో అనుభవ లేమి కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నది. తొలి మ్యాచ్లో సునాయాసంగా గెలిచేలా కనిపించిన హార్దిక్ సేన చేజేతులా పరాజయం కొని తెచ్చుకోగా.. ఈసారి అలాంటి పొరబాట్లు పునరావృతం కాకుండా చూసుకోవాలని చూస్తోంది. మరోవైపు ఇదే జోష్లో రెండో మ్యాచ్లోనూ నెగ్గి ఆధిక్యాన్ని మరింత పెంచుకోవాలని కరీబియన్లు భావిస్తున్నారు. గత ఏడేండ్లలో విండీస్ జట్టు భారత్పై వరుసగా రెండు టీ20ల్లో విజయం సాధించలేదు. ఈ మ్యాచ్లో టీమిండియా తుది జట్టులో మార్పులు చేసే అవకాశాలున్నాయి.
యశస్వికి చాన్స్!
గత మ్యాచ్లో నలుగురు స్పెషలిస్ట్ బౌలర్లతో బరిలోకి దిగడంతో చివర్లో లక్ష్యం పెద్దది కాకపోయినా.. బ్యాటింగ్ చేసే సామర్థ్యం గల వాళ్లు లేకపోవడంతో భారత్ పరాజయం పాలైన విషయం తెలిసిందే. అందుకే ఈ సారి అలా కాకుండా.. బ్యాటింగ్ బలాన్ని పెంచాలని మేనేజ్మెంట్ భావిస్తున్నది. ఇదే జరిగితే ఓ మణికట్టు స్పిన్నర్ను తగ్గించి అతడి స్థానంలో యశస్వి జైస్వాల్కు చోటు కల్పించే చాన్స్ ఉంది. గత మ్యాచ్లో అరంగేట్రం చేసిన తెలంగాణ కుర్రాడు ఠాకూర్ తిలక్ వర్మ చక్కటి ప్రదర్శన కనబర్చగా.. శుభ్మన్ గిల్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, సంజూశాంసన్ సమిష్టిగా సత్తాచాల్సిన అవసరం ఉంది. మరో రెండు నెలల్లో వన్డే ప్రపంచకప్ జరుగనున్న నేపథ్యంలో మరి కుర్రాళ్లు తమకు దక్కిన అవకాశాలను ఏమేరకు వినియోగించుకుంటారో చూడాలి! ఐపీఎల్లో మ్యాచ్ విన్నర్లుగా గుర్తింపు తెచ్చుకొని జాతీయ జట్టుకు ఎంపికైన వాళ్లంతా అదే రేంజ్లో దుమ్మురేపాలని అభిమానులు ఆశిస్తున్నారు.
పిచ్, వాతావరణం
గయానా పిచ్ బౌలింగ్, బ్యాటింగ్కు సమంగా సహకరించనుంది. గతంలో ఇక్కడ జరిగిన ఐదు టీ20 మ్యాచ్ల్లో రెండు వర్షం కారణంగా రద్దయ్యాయి. మిగిలిన మూడు మ్యాచ్ల్లో రెండింట చేజింగ్ జట్టు గెలుపొందింది.
తుది జట్లు (అంచనా)
భారత్: హార్దిక్ (కెప్టెన్), గిల్, ఇషాన్, యశస్వి, సూర్యకుమార్, తిలక్ వర్మ, శాంసన్, అక్షర్, కుల్దీప్/చాహల్, అర్ష్దీప్, ముఖేశ్.
వెస్టిండీస్: పావెల్ (కెప్టెన్), కింగ్, మయేర్స్, చార్లెస్, పూరన్, హెట్మైర్, హోల్డర్, షెఫర్డ్, అకీల్, జోసెఫ్, మెక్కాయ్.