కటక్: బ్యాటింగ్లో రాణించినా.. బౌలర్ల వైఫల్యం కారణంగా తొలి టీ20లో ఓటమి పాలైన టీమ్ఇండియా.. రెండో పోరుకు సిద్ధమైంది. ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఆదివారం కటక్ వేదికగా భారత్, దక్షిణాఫ్రికా మధ్య రెండో టీ20 జరుగనుంది. సీనియర్ల గైర్హాజరీలో యువరక్తంతో నిండి ఉన్న పంత్ సేన.. ఈ మ్యాచ్లో నెగ్గి సిరీస్ సమం చేయాలని భావిస్తుంటే.. ఢిల్లీ మ్యాచ్ ఇచ్చిన జోష్తో సిరీస్లో ఆధిక్యం సాధించాలని సఫారీలు చూస్తున్నారు. మరోసారి పరుగుల వరద పారడం దాదాపు ఖాయమే కాగా.. భువనేశ్వర్ కుమార్ నేతృత్వంలోని బౌలింగ్ దళం సమిష్టిగా సత్తాచాటాల్సిన అవసరం ఉంది. మొదట బ్యాటింగ్ చేయాల్సి వస్తే భారీ స్కోరుపై కన్నేయాలని టీమ్ఇండియా యోచిస్తున్నది. ఇషాన్, శ్రేయస్, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, రుతురాజ్ ఫామ్లో ఉండటం భారత్కు కలిసొచ్చే అంశంకాగా.. యువ పేసర్లు ఉమ్రాన్, అర్శ్దీప్లో ఒకరు అరంగేట్రం చేసే అవకాశాలను కొట్టిపారేయలేం. మరోవైపు దక్షిణాఫ్రికా జట్టు అన్నీ రంగాల్లో సమతూకంగా ఉంది.