పోర్ట్ ఎలిజబెత్: యువ ఆటగాళ్లతో కూడిన భారత జట్టు దక్షిణాఫ్రికా గడ్డపై వన్డే సిరీస్ చేజిక్కించుకునేందుకు రెడీ అయింది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా తొలి పోరులో ఘన విజయం సాధించిన టీమ్ఇండియా.. మంగళవారం మరోసారి సఫారీలతో తలపడనుంది. టెస్టు సిరీస్ సన్నద్ధత కోసం శ్రేయస్ అయ్యర్ జట్టుకు దూరం కాగా.. అతడి స్థానంలో రజత్ పాటిదార్ జట్టులోకి రావడం లాంఛనమే! వాండరర్స్లో జరిగిన తొలి వన్డేలో అర్ష్దీప్, అవేశ్ దుమ్మురేపడంతో రాహుల్ సేన అలవోకగా విజయం సాధించగా.. ఇక్కడ కూడా అదే జోరు కొనసాగించాలని మేనేజ్మెంట్ ఆశిస్తున్నది. అరంగేట్ర మ్యాచ్లో అజేయ అర్ధశతకంతో రాణించిన ఓపెనర్ సాయి సుదర్శన్పై అందరి దృష్టి ఉండనుంది. రుతురాజ్, రజత్ పాటిదార్, తిలక్ వర్మ, కేఎల్ రాహుల్, సంజూ శాంసన్, అక్షర్ పటేల్తో జట్టు బ్యాటింగ్ పటిష్టంగా కనిపిస్తున్నది. టీ20ల్లో రాణించి నయా ఫినిషర్గా గుర్తింపు తెచ్చుకున్న రింకూసింగ్ వన్డే అరంగేట్రం చేస్తాడా చూడాలి. బౌలింగ్లో అర్ష్దీప్, అవేశ్, ముఖేశ్, కుల్దీప్ కీలకం కానున్నారు.