ముంబై: టెస్టు ఫార్మాట్లో అదిరిపోయే ప్రదర్శన కనబర్చిన భారత మహిళల జట్టు.. పరిమిత ఓవర్ల క్రికెట్లోనూ అదే జోరు కొనసాగించేందుకు ప్రయత్నిస్తున్నది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా తొలి వన్డేలో ఆస్ట్రేలియా అమ్మాయిల చేతిలో పరాజయం పాలైన హర్మన్ప్రీత్ బృందం శనివారం రెండో వన్డేలో అమీతుమీ తేల్చుకోనుంది. ఇటీవల స్వదేశంలో ఇంగ్లండ్, ఆస్ట్రేలియాపై టెస్టు మ్యాచ్లు నెగ్గిన టీమ్ఇండియా.. కంగారూలపై వన్డే సిరీస్ను సైతం ఒడిసి పట్టాలని భావిస్తున్నది.
ఇప్పటికే ఆసీస్ ఆధిక్యంలో నిలువగా.. మిగిలిన రెండు మ్యాచ్ల్లో నెగ్గితేనే హర్మన్ బృందం ఆశలు నెరవేరనున్నాయి. ఈ నేపథ్యంలో జట్టు సమిష్టిగా రాణించాలని మేనేజ్మెంట్ ఆశిస్తున్నది. గత మ్యాచ్లో బ్యాటర్లు రాణించి మంచి స్కోరు చేసినా.. బౌలర్లు పెద్దగా ప్రభావం చూపకపోవడంతో మన అమ్మాయిలకు పరాజయం తప్పలేదు. ఈ సారి ఆ లోపాలను సరిదిద్దుకొని సత్తాచాటాలని జట్టు చూస్తుంటే.. స్టార్లతో నిండిన ఆస్ట్రేలియా మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్ కైవసం చేసుకోవాలని భావిస్తున్నది. హర్మన్ప్రీత్, షఫాలీ, జెమీమా, దీప్తి, స్నేహ్ రాణా, పూజ కలిసి కట్టుగా రాణించాల్సిన అవసరముంది.