బ్యాటింగ్లో టాప్-3 ప్లేయర్లు అర్ధ శతకాలతో అదరగొట్టడంతో మంచి స్కోరు చేసిన టీమ్ఇండియా.. ఆనక బౌలింగ్లోనూ సమిష్టిగా సత్తాచాటి విండీస్తో వన్డే సిరీస్లో బోణీ కొట్టింది. ఆఖరి బంతి వరకు నువ్వా నేనా అన్నట్లు సాగిన పోరు.. ‘వన్డేలు దండగ.. ఆపేయడమే ఉత్తమం’ అన్న వారికి చెంపపెట్టులా మారితే.. ఈ విజయం ఇచ్చిన ఊపులో నేడు విండీస్తో రెండో వన్డే ఆడేందుకు టీమ్ఇండియా రెడీ అయింది.
పోర్ట్ ఆఫ్ స్పెయిన్: ఉత్కంఠ పోరులో చివరి వరకు పట్టు వదలని టీమ్ఇండియా.. వెస్టిండీస్తో జరిగిన తొలి వన్డేలో విజయం సాధించింది. శుక్రవారం అర్ధరాత్రి దాటాక ముగిసిన పోరులో శిఖర్ ధవన్ సారథ్యంలోని భారత జట్టు 3 పరుగుల తేడాతో గెలిచి మూడు మ్యాచ్ల సిరీస్లో 1-0తో ముందంజ వేసింది. మొదట నిర్ణీత 50 ఓవర్లలో టీమ్ఇండియా 7 వికెట్ల నష్టానికి 308 పరుగులు చేయగా.. ఛేదనలో కడదాకా పోరాడిన విండీస్ 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 305 పరుగులు చేసింది. కైల్ మయేర్స్ (75), బ్రాండన్ కింగ్ (54), బ్రూక్స్ (46) రాణించగా.. ఆఖర్లో అకీల్ హుసేన్ (32 నాటౌట్), షెఫర్డ్ (25 బంతుల్లో 39 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) భయపెట్టారు. భారత బౌలర్లలో సిరాజ్, శార్దూల్, చాహల్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. తృటిలో సెంచరీ చేజార్చుకున్న శిఖర్ ధవన్ (97)కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.
నేడు రెండో వన్డే
తొలి మ్యాచ్లో ఉత్కంఠ విజయం సాధించిన ధవన్ సేన.. ఆదివారం విండీస్తో రెండో వన్డేలో అమీతుమీ తేల్చుకోనుంది. గత పోరులో టాపార్డర్ రాణించినా.. మిడిలార్డర్ పెద్దగా ఆకట్టుకోలేకపోవడంతో టీమ్ఇండియా ఆశించిన స్కోరు చేయలేకపోయింది. ఒక దశలో సునాయాసంగా 350 పరుగులు దాటుతుందనుకున్న భారత్.. ఆఖరికి మూడొందల మార్క్ చేరేందుకు కూడా ఇబ్బంది పడింది. తొలి ముగ్గురు ఆటగాళ్లు అర్ధ శతకాలతో ఆకట్టుకోగా.. ఆతర్వాత సూర్య, శాంసన్, హుడా, అక్షర్ పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. మరి గత మ్యాచ్ లోపాలను సరిదిద్దుకుని టీమ్ఇండియా ఇక్కడే సిరీస్ పట్టేస్తుందా చూడాలి!