IND vs WI | తరౌబా(ట్రినిడాడ్): వన్డే సిరీస్ ముగిసి రోజు గడిచిందో లేదో భారత్, వెస్టిండీస్ పొట్టి పోరుకు సిద్ధమయ్యాయి. ఇరు జట్ల మధ్య గురువారం నుంచి ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ మొదలుకానుంది. టెస్టు, వన్డే సిరీస్లు ఇచ్చిన ఆత్మవిశ్వాసంతో టీమ్ఇండియా..టీ20ల్లోనూ ఇరుగదీయాలని చూస్తున్నది. సీనియర్ల గైర్హాజరీలో ఐపీఎల్లో మెరుపులు మెరిపించిన యువ క్రికెటర్లు అవకాశాన్ని అందిపుచ్చుకునేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. రోహిత్శర్మ, విరాట్ కోహ్లీ లేకుండా బరిలోకి దిగుతున్న జట్టును ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ముందుకు నడిపించనున్నాడు.
టీ20ల్లో అదరగొడుతున్న తెలంగాణ యువ క్రికెటర్ ఠాకూర్ తిలక్వర్మ, రింకూసింగ్, రవి బిష్ణోయ్, అర్ష్దీప్సింగ్, ముఖేశ్కుమార్, అవేశ్ఖాన్ సత్తాచాటేందుకు తహతహలాడుతున్నారు. వచ్చే ఏడాది జరుగనున్న టీ20 ప్రపంచకప్ను దృష్టిలో పెట్టుకుని బీసీసీఐ..జట్టులో కుర్రాళ్లకు అవకాశమిస్తున్నది. మరోవైపు సొంతగడ్డపై వరుస సిరీస్ పరాజయాలతో ఇబ్బంది పడుతున్న విండీస్..కనీసం టీ20ల్లోనైనా పరువు కాపాడుకోవాలని ప్రయత్నిస్తున్నది. హిట్టర్లతో దట్టంగా కనిపిస్తున్న విండీస్…కుర్రాళ్లతో కళకళలాడుతున్న టీమ్ఇండియాకు ఏమాత్రం పోటీనిస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది. పావెల్ కెప్టెన్గా వ్యవహరించనుండగా, మేయర్స్,హెట్మైర్పై ఆశలు ఉన్నాయి.