మలాహిడే (ఐర్లాండ్): స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ సారథ్యంలోని టీమ్ఇండియా.. ఇంగ్లండ్తో ఏకైక టెస్టు కోసం సిద్ధమవుతుంటే.. ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా నాయకత్వంలోని భారత జట్టు.. ఐర్లాండ్తో టీ20 మ్యాచ్కు రెడీ అయింది. రెండు మ్యాచ్ల సిరీస్లో భాగంగా యువ భారత్ ఆదివారం ఐర్లాండ్తో తొలి టీ20 ఆడనుంది. ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియా వేదికగా టీ20 ప్రపంచకప్ జరుగనున్న నేపథ్యంలో కుర్రాళ్లు తమ సత్తా నిరూపించుకునేందుకు ఈ సిరీస్ వేదిక కానుంది.
ఇటీవల స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్లో రాణించిన ఇషాన్ కిషన్, దినేశ్ కార్తీక్, హార్దిక్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, యుజ్వేంద్ర చాహల్ నిలకడ కొనసాగించాలని చూస్తున్నారు. గాయం నుంచి కోలుకున్న సూర్యకుమార్ యాదవ్ తుది జట్టులో ఉండటం పక్కా కాగా.. సంజూ శాంసన్కు చోటు దక్కుతుందా చూడాలి. ఐపీఎల్ 15వ సీజన్లో తన వేగంతో ఆకట్టుకున్న ఉమ్రాన్ మాలిక్, యార్కర్ స్పెషలిస్ట్ అర్శ్దీప్ సింగ్ అరంగేట్రంపై స్పష్టత రావాల్సి ఉంది. హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ ప్రధాన జట్టుతో పాటు ఇంగ్లండ్ పర్యటనలో ఉండగా.. ద్వితీయ శ్రేణి జట్టుకు ఎన్సీఏ హెడ్ వీవీఎస్ లక్ష్మణ్ కోచ్గా వ్యవహరించనున్నాడు.