మూడేండ్ల తర్వాత భాగ్యనగరంలో జరుగనున్న అంతర్జాతీయ మ్యాచ్కు రంగం సిద్ధమైంది! మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా భారత్, ఆస్ట్రేలియా మధ్య నేడు ఉప్పల్ రాజీవ్గాంధీ స్టేడియంలో ఆఖరి టీ20 జరుగనుంది. ఇప్పటికే చెరో మ్యాచ్ నెగ్గి సమఉజ్జీలుగా ఉన్న ఇరు జట్లు.. కప్పు కోసం గిరిగీసి బరిలో కొట్లాడేందుకు రెడీ అయ్యాయి!!
టికెట్ల అమ్మకాల్లో అవకతవకలు జరిగాయని అభిమానుల ఆగ్రహం ఓ వైపు! అలాంటిదేం లేదు సవ్యంగానే విక్రయించామని హెచ్సీఏ అధికారుల వివరణలు మరో వైపు!! సౌకర్యాలపై సుదీర్ఘ చర్చలు! అసోసియేషన్లో అంతర్గత కుమ్ములాటలపై వార్తలు!! ఇలా గత వారం రోజులుగా వార్తల్లో నిలిచిన ఉప్పల్లో ఎట్టకేలకు మ్యాచ్ జరగబోతున్నది.
కిందటి సారి ఉప్పల్లో ఉప్పెన రేపిన కోహ్లీ మరోసారి వీరవిహారం చేస్తాడా.. లేక నాగ్పూర్లో సిక్సర్ల వర్షం కురిపించిన రోహిత్అదుర్స్ అనిపించుకుంటాడా! ఫుల్ జోష్లో ఉన్న టీమ్ఇండియా సిరీస్ పట్టేస్తుందా.. లేక ఉత్తచేతులతో వెనుదిరుగుతుందా! ఈ ప్రశ్నలన్నీంటికి నేడు భాగ్యనగరంలో బదులు లభించనుంది!
హైదరాబాద్, ఆట ప్రతినిధి: పొట్టి ప్రపంచకప్ సమీపిస్తున్న తరుణంలో మేటి జట్టుతో మెరుగైన ప్రాక్టీస్ కోసం నిర్వహిస్తున్న మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ చివరి దశకు చేరుకుంది. తొలి రెండు మ్యాచ్ల్లో ఆస్ట్రేలియా, భారత్ చెరొకటి చేజిక్కించుకోగా.. ఇక సిరీస్ నిర్ణయాత్మక పోరు ఆదివారం ఉప్పల్ స్టేడియంలో జరుగనుంది. దాదాపు మూడేండ్ల సుదీర్ఘ విరామం తర్వాత అంతర్జాతీయ మ్యాచ్కు హైదరాబాద్ వేదిక కానుండగా.. సిరీస్ పట్టేయాలని ఇరు జట్లు తహతహలాడుతున్నాయి. ఇటీవల జరిగిన ఆసియాకప్లో బౌలర్ల వైఫల్యంతో టీమ్ఇండియా మూల్యం చెల్లించుకోగా.. ప్రస్తుతం జస్ప్రీత్ బుమ్రా, హర్షల్ పటేల్ రాకతో బౌలింగ్ విభాగం బలంగా కనిపిస్తున్నది. మరోసారి పంత్కు మొండిచేయి ఎదురవడం ఖాయమే కాగా.. యుజ్వేంద్ర చాహల్ స్థానంలో అశ్విన్కు ప్లేస్ దక్కుతుందా చూడాలి. రోహిత్శర్మ మంచి టచ్లో ఉండగా.. కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీతో టాపార్డర్ శత్రు దుర్భేద్యంగా ఉంది. ఆ తర్వాత సూర్యకుమార్, హార్దిక్ పాండ్యా, దినేశ్ కార్తీక్ బరిలోకి దిగనున్నారు. భువనేశ్వర్ తిరిగి జట్టులోకి వచ్చే చాన్స్ ఉండగా.. బుమ్రా, హర్షల్, అక్షర్ బౌలింగ్ భారాన్ని మోయనున్నారు. మరోవైపు ఎనిమిదో స్థానం వరకు స్పెషలిస్ట్ బ్యాటర్లతో నిండి ఉన్న కంగారూలు గత మ్యాచ్ జట్టునే కొనసాగించే అవకాశాలున్నాయి. పిచ్ బౌలింగ్, బ్యాటింగ్కు సమానంగా సహకరించనుంది.
2018 నుంచి ఇక్కడ జరిగిన 16 మ్యాచ్ల్లో మొదట బ్యాటింగ్ చేసిన జట్లు 8 సార్లు.. చేజింగ్ టీమ్లు
ఎనిమిది సార్లు గెలుపొందాయి.
2019, డిసెంబర్ 6న ఉప్పల్లో చివరి అంతర్జాతీయ మ్యాచ్ జరిగింది. భారత్, వెస్టిండీస్ మధ్య మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా జరిగిన ఆ పోరులో బ్యాటర్లు పండుగ చేసుకున్నారు. తొలుత విండీస్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. హెట్మైర్ (56) అర్ధ శతకంతో ఆకట్టుకోగా.. లూయిస్ (40), కింగ్ (31), పొలార్డ్ (37), హోల్డర్ (24) రాణించారు. భారత బౌలర్లలో చాహల్ రెండు వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్యఛేదనలో కోహ్లీ (50 బంతుల్లో 94 నాటౌట్; 6 ఫోర్లు, 6 సిక్సర్లు) విజృంభించడంతో టీమ్ఇండియా 18.4 ఓవర్లలో 4 వికెట్లకు 209 రన్స్ చేసింది. రాహుల్ (62; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) హాఫ్సెంచరీతో మెరిశాడు. ఆ మ్యాచ్లో కెప్టెన్గా బరిలోకి దిగిన కోహ్లీ.. కాట్రెల్ బౌలింగ్ సిక్సర్ కొట్టిన అనంతరం పెవిలియన్ వైపు చూస్తూ టిక్కు కొట్టిన సందర్భం అభిమానుల మదిలో ఇంకా తాజాగానే ఉంది!
తుది జట్లు (అంచనా)
భారత్: రోహిత్ (కెప్టెన్), రాహుల్, కోహ్లీ, సూర్యకుమార్, పాండ్యా, కార్తీక్, అక్షర్, హర్షల్, భువనేశ్వర్, బుమ్రా, చాహల్/ అశ్విన్. ఆస్ట్రేలియా: ఫించ్ (కెప్టెన్), గ్రీన్, స్మిత్, మ్యాక్స్వెల్, ఇంగ్లిస్, డావిడ్, వేడ్, కమిన్స్, ఎలీస్, జంపా, హజిల్వుడ్.
పిచ్, వాతావరణం
పిచ్పై పచ్చిక లేదు. వికెట్ బ్యాటింగ్కు అనుకూలించనుంది. మ్యాచ్కు వర్షం ముప్పులేదు.