IND vs AUS | క్రీడాభిమనులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం ఆసన్నమైంది. వన్డే ప్రపంచకప్లో మెగా ఫైట్కు రంగం సిద్ధమైంది. 140 కోట్ల మంది అంచనాలను మోస్తున్న రోహిత్ శర్మ బలగం.. ఐదుసార్లు జగజ్జేత ఆస్ట్రేలియాతో ఆదివారం అమీతుమీ తేల్చుకోనుంది. మరింకెందుకు ఆలస్యం మీరు కూడా టీవీలు ట్యూన్ చేసేయండి!
చెన్నై: వన్డే ప్రపంచకప్ వేట ప్రారంభించేందుకు టీమ్ఇండియా రెడీ అయింది. ఇటీవల ఆసియా కప్ చేజిక్కించుకున్న భారత్.. అదే జోరుతో వరల్డ్కప్లోనూ శుభారంభం చేసేందుకు సమాయత్తమైంది. ఆదివారం చెన్నైలోని చెపాక్ స్టేడియంలో ఆస్ట్రేలియాతో భారత్ తలపడనుంది. పుష్కర కాలం తర్వాత భారత్లో జరుగుతున్న మెగాటోర్నీ కోసం రోహిత్ సేన అస్త్రశస్ర్తాలు సిద్ధం చేసుకుంటే.. వరల్డ్కప్ అనే మాట వింటే చాలు పూనకం వచ్చినట్లు రెచ్చిపోయే కంగారూలు సమరానికి సై అంటున్నారు. రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో జరుగుతున్న ప్రపంచకప్లో ప్రతీ పోరు ప్రధానమైనదే కావడంతో ఈ మ్యాచ్ ఫలితంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఇటీవల స్వదేశంలో జరిగిన వన్డే సిరీస్లో కంగారూలపై టీమ్ఇండియా విజయం సాధించడం.. రోహిత్సేన మనోబలాన్ని పెంచే అంశం కాగా.. దానికి బదులు తీర్చుకోవాలని ఆసీస్ కృతనిశ్చయంతో ఉంది. విశ్లేషకులు ఈ మ్యాచ్ను భారత్ బ్యాటింగ్ బలానికి ఆసీస్ పేస్ దళానికి మధ్య సమరంగా అభివర్ణిస్తుండటంతో.. మన బ్యాటర్లపై భారీ అంచనాలు నెలకొన్నాయి. డెంగ్యూ బారిన పడిన యువ ఓపెనర్ శుభ్మన్ గిల్ త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నట్లు రోహిత్ వెల్లడించడాన్ని బట్టి చూస్తే.. అతడు ఆదివారం పోరుకు అందుబాటులో ఉండటం అనుమానమే! ఇదే నిజమైతే, హిట్మ్యాన్తో కలిసి ఇషాన్ కిషన్ ఇన్నింగ్స్ ఆరంభించనున్నాడు. ఆ తర్వాత విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా బ్యాటింగ్కు రానున్నారు. జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్ పేస్ భారం మోయనున్నారు. ఫుల్ ఫామ్లో ఉన్న మహమ్మద్ షమీకి నిరీక్షణ తప్పకపోవచ్చు. మరోవైపు అటు బౌలింగ్లో, ఇటు బ్యాటింగ్లో ఆస్ట్రేలియా సమతూకంగా కనిపిస్తున్నది. వార్నర్, మార్ష్, స్మిత్, లబుషేన్, గ్రీన్, కారీ, మ్యాక్స్వెల్తో ఆ జట్టు బ్యాటింగ్ శత్రుదుర్బేధ్యంగా కనిపిస్తున్నది.
దశాబ్ద కాలంగా ఒక్క ఐసీసీ టోర్నీ కూడా గెలువని భారత జట్టు.. ఈ సారి ఆ కరువు తీర్చుకోవాలని తహతహలాడుతున్నది. 2011లో స్వదేశంలో జరిగిన వన్డే ప్రపంచకప్లో విశ్వవిజేతగా నిలిచిన భారత్.. సేమ్ సీన్ రిపీట్ చేయాలనుకుంటున్నది. అప్పటి జట్టు నుంచి కోహ్లీ, అశ్విన్ మాత్రమే ప్రస్తుత టీమ్లో చోటు దక్కించుకోగా.. మిగిలిన వాళ్లంతా ప్రపంచ చాంపియన్ బిరుదు కోసం పరితపిస్తున్నారు. లీగ్ దశలో తొమ్మిది మ్యాచ్లను తొమ్మిది వేర్వేరు వేదికలపై ఆడనున్న టీమ్ఇండియా.. చెన్నై నుంచి సమరశంఖం పూరించాలని మనమూ కోరుకుందాం! టీమిండియా ఆల్ ది బెస్ట్!!
2019 వన్డే ప్రపంచకప్ అనంతరం భారత్, ఆస్ట్రేలియా మధ్య 12 వన్డేలు జరగగా.. ఇరు జట్లు చేరో ఆరు విజయాలు నమోదు చేసుకున్నాయి.
భారత్: రోహిత్ (కెప్టెన్), గిల్/ఇషాన్, కోహ్లీ, శ్రేయస్, రాహుల్, పాండ్యా, జడేజా, అశ్విన్, కుల్దీప్, బుమ్రా, సిరాజ్.
ఆస్ట్రేలియా: కమిన్స్ (కెప్టెన్), వార్నర్, మార్ష్, స్మిత్, లబుషేన్, గ్రీన్, కారీ, మ్యాక్స్వెల్, స్టార్క్, హజిల్వుడ్, జాంపా.3
ప్రపంచకప్ అనేది అత్యంత ముఖ్యమైంది. అది సాధించకపోతే.. కెరీర్లో ఏదో అసంతృప్తి మిగిలే ఉంటుందని ఇప్పటికే ఎంతో మంది గొప్ప ప్లేయర్లు చెప్పారు. నేనూ అదే అంటున్నా. దీనికన్న పెద్దది ఇంకేముంటుంది.
-రోహిత్, భారత కెప్టెన్