న్యూఢిల్లీ: టీమిండియా యంగ్ బ్యాటర్, హైదరాబాదీ తిలక్ వర్మ భారత జట్టు టీ20 కెప్టెన్సీ రేసులోకి వచ్చాడు. పేలవ ఫామ్లో ఉన్న ప్రస్తుత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ను తప్పించి కొత్త వ్యక్తికి కెప్టెన్సీ అప్పగించాలని సీనియర్ సెలెక్షన్ కమిటీ భావిస్తోంది. రేసులో సీనియర్లు శ్రేయస్ అయ్యర్, శుభ్మన్ గిల్తో పాటు అనూహ్యంగా తిలక్ వర్మ పేరు కూడా వినిపిస్తోంది. అయితే, కెప్టెన్సీ మార్పు నిర్ణయాన్ని బీసీసీఐ పెద్దలు హెడ్ కోచ్ గంభీర్కు అప్పగించినట్టు తెలుస్తోంది. దాంతో సూర్య భవిష్యత్తు ఇప్పుడు పూర్తిగా గంభీర్ చేతుల్లోకి వెళ్లింది. సూర్యను కెప్టెన్సీ నుంచి తప్పించాలని చూస్తున్న సెలెక్షన్ కమిటీ కనీసం బ్యాటర్గా కూడా అతడిని తుది జట్టులో కొనసాగించేందుకు ఇష్ట పడటం లేదని బోర్డు వర్గాలు చెబుతున్నాయి.
కానీ, గంభీర్తో సూర్యకు ఉన్న సాన్నిహిత్యం కారణంగా తుది నిర్ణయాన్ని హెడ్ కోచ్ విచక్షణకే వదిలేయాలని బోర్డు పెద్దలు భావిస్తున్నారు. 2028 ఒలింపిక్స్ను దృష్టిలో ఉంచుకుని సెలెక్టర్లు దీర్ఘకాలిక ప్రణాళికలు రచిస్తుండటంతో సూర్య స్థానం ప్రశ్నార్థకంగా మారింది. ఒకవేళ గంభీర్ సెలెక్టర్ల నిర్ణయానికి మద్దతు తెలిపి సూర్యను పక్కన పెడితే.. కొత్త కెప్టెన్ రేసులోకి శ్రేయస్ , గిల్, తిలక్ పేర్లు వచ్చే అవకాశం ఉంది. శ్రేయస్, గిల్ రేసులో ముందున్నారు. అయితే, శ్రీలంక వేదికగా జరగబోయే భారత్-ఏ ట్రై సిరీస్కు కెప్టెన్గా ఎంపికైన హైదరాబాదీ తిలక్ పేరు కూడా ప్రస్తుతం సెలెక్టర్ల పరిశీలనలో ప్రముఖంగా వినిపిస్తోంది.