టీ20 ప్రపంచకప్లో దాయాది పాకిస్తాన్ చేతిలో టీమిండియా ఘోరంగా ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్లో ధారాళంగా పరుగులు సమర్పించుకున్న పేసర్ మహమ్మద్ షమీపై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ జరిగింది. అతని మతాన్ని అడ్డుగా పెట్టి చాలా మంది తిట్టారు. ఆ సమయంలో సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్, ఇర్ఫాన్ పఠాన్, వీరేంద్ర సెహ్వాగ్ వంటి మాజీలు చాలా మంది షమీకి అండగా నిలబడ్డారు.
అప్పటి కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా మీడియా సమావేశంలో ఇలా ట్రోల్ చేసేవాళ్లను పిరికివాళ్లుగా అభివర్ణించాడు. దీనిపై తాజాగా షమీ స్పందించాడు. ఇలా మతాన్ని అడ్డుపెట్టుకొని తిట్టే వాళ్లు భారతీయులే కాదని ఈ పేసర్ విమర్శించాడు.
‘‘ఇలాంటి ఆలోచనా విధానానికి ఎటువంటి మందూ ఉండదు. ఇలా మతాన్ని అడ్డుపెట్టుకొని తిట్టే వారు ఫ్యాన్స్ కాదు, గట్టిగా మాట్లాడితే భారతీయులే కాదు. ఒక ఆటగాడిని హీరోలా భావించే ఎవరూ ఇలా ప్రవర్తించరు. అలా చేస్తే వాల్లు భారత జట్టు మద్దతుదారులే కాదు. అలాంటి వాళ్లు చేసే కామెంట్లకు ఎవరూ నొచ్చుకోకూడదనే నేను భావిస్తా’’ అన్నాడు.
అలాగే ఇలాంటి కామెంట్లకు స్పందిస్తే అనవసరంగా అలాంటి వాళ్లకు ప్రాధాన్యం ఇచ్చినట్లు ఉంటుందన్నాడు. అందుకే తాను ఇలాంటి ట్రోల్స్పై స్పందించనని స్పష్టం చేశాడు.