Cricket Records | క్రికెట్లో ఫార్మాట్ ఏదైనా ఆటగాడికి సెంచరీ ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 99 పరుగులు చేసి ఆ ఒక్క పరుగు ముందు అవుటైతే ఆ బాధ వర్ణనాతీతం. అవుటైతే ఇక చేసేదేమీ లేదు కానీ క్రీజులో ఉండీ 99 పరుగుల వద్ద నాటౌట్గా మిగిలితే అది చెప్పుకోలేని బాధ. యాషెస్ సిరీస్లో భాగంగా ఇటీవల ఇంగ్లండ్తో జరిగిన నాలుగో టెస్టులో ఇంగ్లండ్ వికెట్ కీపర్ బెయిర్స్టో 99 పరుగుల వద్ద నాటౌట్గా మిగిలాడు. క్రీజులో ఉన్న జేమ్స్ అండర్సన్ చివరి వికెట్గా వెనుదిరగడంతో మరో ఎండ్లో ఉన్న బెయిర్ స్టో 99 పరుగులతో నాటౌట్గా మిగిలిపోవాల్సి వచ్చింది. ఫలితంగా మరో బ్యాటర్ అవుట్ కావడంతో సెంచరీ మిస్ చేసుకున్న రెండో ఇంగ్లండ్ క్రికెటర్గా బెయిర్స్టో నిలిచిపోయాడు. 1979 యాషెస్ సిరీస్లోనూ ఇలాంటి ఘటనే జరిగింది. ఇంగ్లిష్ క్రికెట్ బాబ్ విల్లిస్ను జెఫ్ డైమోక్ అవుట్ చేశాడు. దీంతో మరో ఎండ్లో 99 పరుగులతో ఉన్న జెఫ్రీ బాయ్కాట్ విచారంగా మైదానం వీడాల్సి వచ్చింది. ఆ తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు మరో ఇంగ్లిష్ క్రికెటర్ 99 పరుగుల వద్ద మైదానం వీడాడు. వీరితోపాటు మరో ఐదుగురు దురదృష్టవంతులు కూడా ఉన్నారు. వారే వీరు.
1994 యాషెస్ సిరీస్ నాలుగో టెస్టులో స్టీవ్ వా కూడా ఇలానే 99 పరుగుల వద్ద నాటౌట్గా మిగిలిపోయాడు. సెంచరీపై కన్నేసిన స్టీవ్ వా మరొక్క పరుగు కోసం వేచి చూస్తూ మరో ఎండ్లో ఉన్న సమయంలో మెక్ డెర్మట్ చివరి వికెట్గా వెనుదిగడంతో వా సెంచరీ ఆశలు అడియాసలయ్యాయి. 99 పరుగులతో నాటౌట్గా మిగిలిపోయాడు.
2002లో స్వదేశంలో శ్రీలంకతో జరిగిన రెండు టెస్టుల సిరీస్లో సౌతాఫ్రికా ఆటగాడు షాన్ పొలాక్కు ఇలాంటి అనుభవమే ఎదురైంది. చివరి టెస్టులో పొలాక్ 99 పరుగులతో ఉన్న వేళ క్రీజులో ఉన్న మఖయ ఎన్తిని అవుట్ కావడంతో పొలాక్ శతకం పూర్తిచేయలేకపోయాడు. అయితే, ఆ మ్యాచ్లో విజయం సాధించడంతో పొలాక్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.
షాన్ పొలాక్కు ఎదురైన అనుభవమే ఆ తర్వాతి ఏడాది ఆండ్రూ హాల్కు ఇంగ్లండ్ పర్యటనలో ఎదురైంది. ఐదు టెస్టుల సిరీస్లో భాగంగా హెడింగ్లీలో జరిగిన నాలుగో టెస్టులో సఫారీ ఆటగాడు ఆండ్రూ హాల్ అద్భుతమైన ఆటతీరుతో ప్రేక్షకులను అలరించాడు. 99 పరుగులు చేసి తొలి సెంచరీకి ఒక్క పరుగు దూరంలో నిలిచాడు. అయితే, డెవాల్డ్ ప్రిటోరియస్ను జేమ్స్ కిర్ట్లీ అవుట్ చేయడంతో హాల్ తొలి సెంచరీ ఆశలు ఫలించలేదు. 99 పరుగులతో నాటౌట్గా నిలిచి విచారంగా డ్రెస్సింగ్ రూముకు చేరాడు.
1999లో నాలుగు టెస్టుల సిరీస్ కోసం న్యూజిలాండ్ జట్టు ఇంగ్లండ్లో పర్యటించింది. ఎడ్జ్బాస్టన్లో జరిగిన తొలి టెస్టులో అలెక్స్ టుడోర్ కూడా 99 పరుగులతో నాటౌట్గా మిగిలిపోయాడు. 95 పరుగులతో క్రీజులో ఉన్న టుడోర్ చివరి బంతికి సిక్స్ కొడితే సెంచరీ పూర్తయ్యేదే. బంతిని బలంగా బాదినా అది బౌండరీకే పరిమితం కావడంతో 99 పరుగులతో నాటౌట్గా మిగిలిపోయాడు. అయితే, ఫోర్తో జట్టును గెలిపించడంతో పాటు అద్భుతంగా ఆడిన టుడోర్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.
పాకిస్థాన్ జట్టు 2017లో వెస్టిండీస్లో పర్యటించింది. తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్లో విండీస్ 312 పరుగులు చేసింది. బదులుగా బ్యాటింగ్ ప్రారంభించిన పాక్.. 9 వికెట్ల నష్టానికి 407 పరుగులు చేసింది. క్రీజులో అబ్బాస్, మరో ఎండ్లో కెప్టెన్ మిస్బావుల్ హక్ 99 పరుగులతో ఉన్నాడు. 139వ ఓవర్ వేసిన రోస్టన్ చేజ్ నాలుగో బంతికి అబ్బాస్ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. దీంతో పాక్ ఆలౌట్ అయింది. మిస్బా 99 పరుగులతో నాటౌట్గా మిగిలిపోయాడు.