ద్వైపాక్షిక సిరీస్లు, ఇంటాబయట వరుస విజయాలు సాధించే భారత్.. నాకౌట్ మ్యాచ్ అనేసరికి మాత్రం ముందే ఆందోళన పడటం పరిపాటిగా మారింది. గత రెండు ప్రపంచకప్ సెమీఫైనల్స్లోనూ ఓటమి పాలైన టీమ్ఇండియా.. ఈ సారి ఆ విఘ్నాన్ని దాటి తుదిపోరుకు చేరింది. మరి దాదాపు అదే జట్టుతో బరిలోకి దిగిన భారత్.. ఈసారి సంపూర్ణ ఆధిపత్యం కనబర్చడం వెనుక ఉన్న ప్రధాన కారణమేంటో తెలుసా?
కీలక మ్యాచ్ల్లో ఒత్తిడి ప్రధాన పాత్ర పోషిస్తుందనేది అందరికీ తెలిసిందే. కాగా.. ఈసారి మనవాళ్లు దాన్ని ఏమాత్రం దరిచేరనివ్వడం లేదు. జట్టులో మార్పుల్లేవు, కూర్పులో ఇబ్బందుల్లేవు. ముఖ్యంగా ఆటగాళ్ల మధ్య చక్కటి సమన్వయం కనిపిస్తున్నది. దీనికి తోడు సొంతగడ్డపై ఆడుతుండటంతో.. మైదానంలోకి దిగేది పదకొండు మందే అయినా.. అభిమానుల ప్రోత్సాహం రూపంలో వారికి అదనంగా పన్నెండో ప్లేయర్ ప్రయోజనం చేకూరుతున్నది. ఇదే జోష్లో మనవాళ్లు మూడోసారి జగజ్జేతగా నిలిస్తే.. ఆ పన్నెండో ప్లేయర్ కంటే ఎక్కువ సంతోషించేవాళ్లు మరొకరు ఉండరు!
నమస్తే తెలంగాణ క్రీడావిభాగం : ప్రపంచకప్ ప్రారంభమైనప్పటి నుంచి భారత జట్టు ఎదురు లేకుండా సాగుతున్నది. లీగ్ దశలో ఆడిన తొమ్మిది మ్యాచ్ల్లోనూ నెగ్గిన రోహిత్ సేన.. సెమీఫైనల్లో న్యూజిలాండ్పై ఘనవిజయం సాధించింది. భారత క్రికెట్ జట్టు మైదానంలోకి దిగుతుందంటే చాలు.. అది ఏ రాష్ట్రమైనా, ఏ నగరమైనా స్టాండ్స్ నిండిపోవడం పక్కా. అదే ప్రపంచకప్ అనేసరికి ఆ ప్రభావం ఇంకాస్త ఎక్కువుంటుందని కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. మెగాటోర్నీలో భాగంగా గత నెల 8న చెన్నై వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి పోరు నుంచి ఆదివారం అదే ఆస్ట్రేలియాతో అహ్మదాబాద్లో జరుగనున్న తుది పోరు వరకు టీమ్ఇండియా ఆడిన ప్రతీ మ్యాచ్కు అభిమానులు బ్రహ్మరథం పట్టారు. మైదానంలో మనవాళ్లు మంచి ప్రదర్శన చేస్తున్న సమయంలో దిక్కులు పిక్కటిల్లేలా అరుస్తూ ఉత్సాహాన్ని వెయ్యి రెట్లు పెంచుతున్న ఫ్యాన్స్.. భారత జట్టుకు ప్రధాన బలం. స్టాండ్స్లో దేశభక్తి గీతాలు పాడటం.. ‘జీతేగా భయ్ జీతేగా.. ఇండియా జీతేగా’ వంటి నినాదాలతో హోరెత్తించడాన్ని దాటి ఈ ప్రపంచకప్లో అభిమానుల సందడి రెట్టింపైంది.
సాధారణంగా ఫ్యాన్స్ కేకలను పెద్దగా పట్టించుకోని టీమ్ మేనేజ్మెంట్ కూడా ఈసారి అభిమానుల అల్లరికి చలించింది. ఆరో ప్రత్యామ్నయ బౌలర్ లేకపోవడంతో అవసరమైతే కోహ్లీతో ఓ రెండు ఓవర్లు వేయించాలని మేనేజ్మెంట్ అనుకునే లోపే.. స్టాండ్స్ నుంచి అభిమానులు ‘కోహ్లీ కో బౌలింగ్ దో’ అంటూ లయబద్దంగా మైదానంలో మోత మోగించారు. ఈ దెబ్బకు చివరి లీగ్ మ్యాచ్లో కోహ్లీ బౌలింగ్ చేయడంతో పాటు ఓ వికెట్ కూడా ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఆ తర్వాత ఎప్పుడూ బంతి పట్టని శుభ్మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ కూడా బౌలింగ్ చేయగా.. చివరగా అభిమానులు రోహిత్ బౌలింగ్ చేయాలని అరుపులతో స్టేడియాన్ని హోరెత్తించడంతో హిట్మ్యాన్ కూడా తన బౌలింగ్ నైపుణ్యం ప్రదర్శించాల్సి వచ్చింది.
మైదానంలో ఆడుతున్నది పదకొండు మందే అయినా.. ప్రేక్షకుల ప్రోత్సాహం రూపంలో ఓ అదృశ్య హస్తం ఎప్పుడూ టీమ్ఇండియా వెన్నంటే ఉంటుందనేందుకు ఇంతకుమించిన నిదర్శనం అవసరం లేదు. లీగ్ దశలో పాకిస్థాన్తో మ్యాచ్ తీసుకున్నా.. సెమీఫైనల్లో న్యూజిలాండ్తో పోరును చూసినా.. మైదానం మొత్తం నీలి రంగు పులుముకుంది. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియంలో ఆదివారం జరగనున్న మెగా పోరుకు సౌండ్ బాక్స్లు బద్దలు కావడం ఖాయమే!
నాణానికి బొమ్మా బొరుసు ఉన్నట్లే.. భారత అభిమానులకు ప్రేమను పంచడంతో పాటు.. తీవ్రంగా స్పందించే అలవాటు కూడా ఉంది. ఈడెన్ గార్డెన్స్లో శ్రీలంకతో జరిగిన 1996 వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్లో అభిమానులు రచ్చ లేపారు. లంక ఓ మాదిరి స్కోరుకే పరిమితమైనా.. ఛేదనలో భారత్ తడబడింది. సచిన్ టెండూల్కర్ ఒక్కడే అర్ధశతకంతో రాణించగా.. మిగిలిన వాళ్లంతా ఘోరంగా విఫలమయ్యారు. దీంతో చిర్రెత్తుకొచ్చిన ఫ్యాన్స్.. మ్యాచ్ ముగియక ముందే మైదానంలోకి నీళ్ల సీసాలు, నట్టులు, బోల్టులు విసిరి నానా హంగామా సృష్టించారు. కాసేపు బ్రేక్ ఇచ్చి తిరిగి మ్యాచ్ ప్రారంభిస్తే.. ఈ సారి ఏకంగా స్టాండ్స్లో సీట్లకు నిప్పు పెట్టారు. దీంతో లంకను విజేతగా ప్రకటించాల్సి వచ్చింది.
భారత్, ఆస్ట్రేలియా మధ్య ఆదివారం జరిగే ప్రపంచకప్ ఫైనల్ పోరు అభిమానులకు పసందైన విందు అందించనుంది. వింగ్ కమాండర్ సిద్దేశ్ కార్తీక్ సారథ్యంలో సూర్యకిరణ్ ఎయిర్క్రాఫ్ట్లు ఒళ్లు జల్దరించే విన్యాసాలు చేయనున్నాయి. తొమ్మిది విమానాలు పది నిమిషాల పాటు స్టేడియంపై చక్కర్లు కొడుతాయి. ఇన్నింగ్స్ విరామ సమయంలో ఇప్పటి వరకు ప్రపంచకప్ గెలిచిన కెప్టెన్లను బీసీసీఐ ఘనంగా సన్మానించనుంది. వీరి కోసం ప్రత్యేకంగా బ్లేజర్లను డిజైన్ చేశారు. మ్యూజిక్ కంపోజర్ ప్రీతమ్ ఆధ్వర్యంలో సంగీత కార్యక్రమాలు ఫ్యాన్స్ను మరో లోకంలోకి తీసుకెళ్లనున్నాయి.