షాంఘై: ప్రపంచకప్ ఆర్చరీ స్టేజ్-2 టోర్నీలో భారత మహిళల రికర్వ్ జట్టు మరోసారి సంచలన ప్రదర్శనతో అదరగొట్టింది. వెటరన్ ఆర్చర్ దీపిక కుమారి నేతృత్వంలోని అంకితా భకత్, కుంకుమ్ మొహాద్తో కూడిన భారత బృందం.. ఫైనల్లో 5-4తో టైటిల్ ఫేవరెట్లుగా ఉన్న చైనాను ఓడించి స్వర్ణం గెలుచుకుంది. నాలుగు సెట్లలో ఇరుజట్ల స్కోర్లు 4-4తో సమమవగా షూటాఫ్ ద్వారా తేలిన ఫలితంలో భారత ఆర్చర్లు ఏకాగ్రత కోల్పోకుండా పసిడిని గురిచూసి కొట్టారు.
తొలి సెట్లో 54-53 (2 సెట్ పాయింట్లు)తో ఆధిక్యంలో నిలిచిన భారత అమ్మాయిలు.. తర్వాత రెండు సెట్లలో (52-55, 56-57 (చైనాకు 4 సెట్పాయింట్లు))తో వెనుకబడ్డారు. కానీ ఆఖరి సెట్లో 54-53తో భారత్ ఖాతాలో మరో రెండు సెట్ పాయింట్లు చేరడంతో షూటాఫ్ అనివార్యమైంది.
షూటాఫ్లో దీపిక బృందం.. 28 పాయింట్లు స్కోరు చేయగా చైనా 26 మాత్రమే కొట్టగలిగింది. భారత రికర్వ్ మహిళల జట్టుకు మూడేండ్ల తర్వాత ఇదే తొలి పతకం. దీపికకు మాత్రం ప్రపంచకప్లలో ఇది ఏకంగా 12వ మెడల్. ఈ టోర్నీలో రికర్వ్ జట్టు ఏడు పతకాలు గెలువగా ఆ ఏడింటిలోనూ దీపిక ఉండటం గమనార్హం.