సఫారీ గడ్డపై టెస్టు సిరీస్ నెగ్గాలనే దృఢ సంకల్పంతో బరిలోకి దిగిన భారత జట్టు.. కనీస పోరాటం కనబర్చకుండా మూడు రోజుల్లోనే ప్రత్యర్థికి మ్యాచ్ అప్పగించేయగా.. ఈ ఓటమికి తోడు ఇప్పుడు మరో షాక్ తగిలింది. ఇంట్రా స్కాడ్కు బదులు ప్రాక్టీస్ మ్యాచ్లుఆడుంటే బాగుండేదని సీనియర్లు చురకలంటిస్తుంటే.. స్లో ఓవర్రేట్ కారణంగా రోహిత్సేనకు ఐసీసీ రెండు పాయింట్లు కోత పెట్టింది!
Team India | దుబాయ్: దక్షిణాఫ్రికాతో తొలి టెస్టులో ఆకట్టుకోలేకపోయిన భారత జట్టుకు మరో దెబ్బ తగిలింది. సెంచూరియన్ పోరులో స్లో ఓవర్రేట్కు పాల్పడినందుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) టీమ్ సభ్యుల మ్యాచ్ ఫీజులో 10 శాతం కోత విధించింది. దీంతో పాటు రెండు ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) పాయింట్ల కోత విధించింది. మనవాళ్లు ఏమాత్రం పోరాట పటిమ కనబర్చకపోవడంతో మూడు రోజుల్లోనే ముగిసిన మ్యాచ్లో నిర్ణీత సమయానికి టీమ్ఇండియా రెండు ఓవర్లు తక్కువ వేసింది. దీంతో మ్యాచ్ రెఫరీ క్రిస్ బ్రాడ్ రెండు పాయింట్లు జరిమానా విధించాడు. ‘భారత్ రెండు ఓవర్లు తక్కువ వేసింది. దీంతో ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 10 శాతంతో పాటు డబ్ల్యూటీసీ రెండు పాయింట్లు కోత విధించాం’ అని ఐసీసీ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. 2023-25 డబ్ల్యూటీసీ సర్కిల్లో భారత్ ఇప్పటి వరకు మూడు మ్యాచ్లు ఆడగా.. ఒక విజయం, ఒక ఓటమి, ఒక ‘డ్రా’తో 38.89 ర్యాంకింగ్ పాయింట్లతో ఆరో స్థానానికి పడిపోయింది. దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా వరుసగా తొలి మూడు ప్లేస్ల్లో ఉన్నాయి.
అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్తో జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించగల ఆల్రౌండర్ రవీంద్ర జడేజా.. రెండో టెస్టు వరకు ఫిట్నెస్ సాధించేందుకు కసరత్తులు చేస్తున్నాడు. వెన్నునొప్పి కారణంగా తొలి మ్యాచ్కు దూరమైన జడేజా.. శుక్రవారం సాధన ప్రారంభించాడు. జడ్డూ గైర్హాజరీలో సఫారీల చేతిలో టీమ్ఇండియా ఓడటమే గాక.. స్లో ఓవర్ రేట్ కారణంగా రెండు డబ్ల్యూటీసీ పాయింట్లు కూడా కోల్పోయింది. క్షణాల్లో ఓవర్ ముగించగల జడేజా అందుబాటులో ఉంటే ఈ పరిస్థితి ఎదురయ్యేది కాదని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.
కెరీర్లో చివరి టెస్టు ఆడనున్న దక్షిణాఫ్రికా సీనియర్ ఆటగాడు డీన్ ఎల్గర్ ఈ మ్యాచ్లో సఫారీ జట్టుకు సారథిగా వ్యవహరించనున్నాడు. తొలి పోరులో గాయపడ్డ రెగ్యులర్ కెప్టెన్ టెంబా బవుమా స్థానంలో ఈ మ్యాచ్కు ఎల్గర్ నాయకత్వం వహించనున్నాడు.
గాయం కారణంగా దక్షిణాఫ్రికా పర్యటనకు దూరమైన సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ స్థానంలో అవేశ్ఖాన్ జట్టుకు ఎంపికయ్యాడు. పేస్కు అనుకూలించిన తొలి టెస్టులో టీమ్ఇండియా ఘోరపరాజయం మూటగట్టుకోగా.. ఇప్పుడు బోర్డు దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. రెండో టెస్టుకు ముందు అవేశ్ జట్టుతో చేరుతాడని ఒక ప్రకటనలో తెలిపింది. ‘గాయపడ్డ షమీ స్థానంలో ఆల్ఇండియా సీనియర్ సెలెక్షన్ కమిటీ అవేశ్ ఖానును ఎంపిక చేసింది. వచ్చే నెల 3 నుంచి కేప్టౌన్ వేదికగా జరగనున్న రెండో టెస్టుకు అవేశ్ అందుబాటులో ఉంటాడు’ అని బోర్డు పేర్కొంది.