IPL 2022 | క్రికెట్ అభిమానుల్లో జోష్ నింపే టోర్నీ ఐపీఎల్.. ఈ ఏడాది ఐపీఎల్-2022 రెండు కుటుంబాలకు మరింత సంతోషాన్ని తెచ్చి పెట్టింది. ఆ రెండు కుటుంబాల సోదరులను వివిధ ఐపీఎల్ ఫ్రాంచైసీలు కొనుగోలు చేశాయి. వారిని ఐపీఎల్ కోటీశ్వరులను చేసింది. ఆ నలుగురికి కలిపి రూ.42.5 కోట్ల ఆదాయం లభించింది. వారే హార్దిక్ పాండ్యా-కృనాల్ పాండ్యా, దీపక్ చాహర్-రాహుల్ చాహర్. మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ సారధ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) జట్టులో ఆల్రౌండర్ దీపక్ చాహర్ జత కలిశాడు. దీపక్ను సీఎస్కే రూ.14 కోట్లకు సొంతం చేసుకుంది. అదే టైంలో పంజాబ్ కింగ్స్ ఎలెవెన్.. దీపక్ సోదరుడు రాహుల్ చాహర్ను రూ.5.25 కోట్లకు కొనుగోలు చేసింది.
క్రికెట్ ఇండియాలో మరో సోదరుల జంట హార్థిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా పంట పండింది. హార్థిక్ పటేల్ను గుజరాత్ టైటాన్స్ రూ.15 కోట్లకు కొనుగోలు చేసి జట్టు సారధిగా నియమించుకుంది. హార్దిక్ పాండ్యా సోదరుడు కృనాల్ పాండ్యాను మరో కొత్త జట్టు లక్నో సూపర్ జెయింట్స్ రూ.8.25 కోట్లకు కొనుగోలు చేసింది. కొన్నేండ్లు పాండ్యా సోదరులు ఐపీఎల్లో ఆడుతున్నారు. క్రికెట్లోకి రాక ముందు పాండ్యా కుటుంబం చాలా కష్టాల్లో సాగింది. వారి కుటుంబం మంచి భోజనం కూడా చేయలేని పరిస్థితి నెలకొంది. 2010లో హార్దిక్ పాండ్యా తండ్రి గుండెపోటుకు గురై అరోగ్యం దెబ్బ తిన్నది. తండ్రి ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు పాండ్యా సోదరులు పక్కనే ఉన్న పల్లెకు వెళ్లి రూ.400-500లకు క్రికెట్ ఆడే దుస్థితి నెలకొంది. చిన్నారులు మ్యాగీ తినడానికి ప్రాణం పెడతారు. కానీ ఆ మ్యాగీ కొనుక్కుని తినడానికి కూడా డబ్బుల్లేవని హార్దిక్ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.
ఇక చాహర్ సోదరులు క్రికెటర్లుగా మారడం ఆసక్తికరంగా సాగింది. వాయుసేన రిటైర్డ్ తండ్రి లోకేంద్ర చాహర్.. తన తనయులు దీపక్ చాహర్, రాహుల్ చాహర్లకు కోచ్గా పని చేశాడు. వీరి అనుబంధం సంక్లిష్టం.. చాలా ప్రత్యేకం. దీపక్, రాహుల్ కజిన్స్. వీరిద్దరూ అక్కాచెల్లెండ్లు.. అన్నాతమ్ముళ్ల పిల్లలు. ఆగ్రా వాసి అయిన లోకేంద్ర సింగ్ చాహర్ 2004లో శ్రీగంగానగర్లో విధులు నిర్వర్తిస్తున్నప్పుడు దీపక్ చాహర్ గల్లీ క్రికెట్ ఆడేవాడు. మిగతా వారి కంటే బాగా ఆడటం.. చక్కగా బౌలింగ్ చేయడం గమనించాడు లోకేంద్ర.. అంతే తన కొడుకును క్రికెటర్గా తీర్చిదిద్దడానికి అకాడమీలో చేర్చాడు. లోకేంద్రకూ క్రికెటర్ కావాలని ఉన్నా.. కుటుంబ మద్దతు కొరవడింది. అందుకే తన కొడుకు, తమ్ముడి కొడుకును క్రికెటర్లుగా తీర్చిదిద్దాలనుకున్నాడు లోకేంద్ర సింగ్ చాహర్.