CM Cup | తెలంగాణ తళుకులీనింది! అమరుల ఆశయసిద్ధితో పురుడుపోసుకుని సీఎం కేసీఆర్ సారథ్యంలో అభివృద్ధిలో దేశానికి దిక్సూచిగా దూసుకెళుతున్న తెలంగాణ ఆటల్లోనూ అదరగొడుతున్నది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సత్తాచాటాలన్న సీఎం ఆశయాలకు అనుగుణంగా ముందుకెళుతున్నది. గ్రామీణ ప్రతిభను వెలుగులోకి తీసుకు రావాలనే ఉద్దేశంతో తొలిసారి జరుగుతున్న సీఎం కప్ ఆరంభ వేడుకలు అంబరాన్నంటాయి. ఒలింపిక్స్ను తలపించేలా ప్రారంభోత్సవ కార్యక్రమం నభూతో నభవిష్యత్ అన్న రీతిలో సాగింది.
33 జిల్లాల నుంచి ప్లేయర్లతో ఎల్బీ స్టేడియం కొత్త రూపు సంతరించుకోగా, రాష్ట్ర సాంస్కృతిని ప్రతిబింబిస్తూ కళాకారులు పాడిన పాటకు ప్లేయర్లు దుమ్ములేపారు. ఓవైపు మాస్ సాంగ్స్తో సింగర్లు అదుర్స్ అనిపిస్తే…తామేం తక్కువ కాదన్నట్లు అమ్మాయిలు, అబ్బాయిలు ఈలలు, కేరింతలతో వేడుకలకు నయా జోష్ తీసుకొచ్చారు. ఆదిలాబాద్తో మొదలైన మార్చ్ ఫాస్ట్ హైదరాబాద్తో ముగియగా, మంత్రులు శ్రీనివాస్గౌడ్, మల్లారెడ్డి, సాట్స్ చైర్మన్ ఆంజనేయగౌడ్ గౌరవ వందనం స్వీకరించారు. మొత్తంగా సీఎం కప్ పోటీలు ప్లేయర్ల మదిలో కలకాలం గుర్తుండిపోయే రీతిలో ఆద్యంతం ఆసక్తికరంగా సాగాయి.
రాష్ట్ర రాజధాని నగరం హైదరాబాద్ కొత్త శోభను సంతరించుకుంది. దశాబ్ది ఉత్సవాలకు రాష్ట్రం సన్నద్ధమవుతున్న వేళ నగరం నడిబొడ్డును సీఎం కప్ ప్రారంభ వేడుకలు అంబరాన్నంటాయి. రాష్ట్ర చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న సీఎం కప్ ఆరంభ కార్యక్రమం సోమవారం ఎల్బీ స్టేడియం వేదికగా అట్టహాసంగా జరిగాయి. 33 జిల్లాల నుంచి ప్లేయర్లు స్టేడియానికి తరలిరాగా, సాట్స్ ఆధ్వర్యంలో వేడుకలు ప్రతిష్ఠాత్మక ఒలింపిక్స్ను తలపిస్తూ సాగాయి. రాష్ట్ర సంస్కృతికి ప్రతిబింబంగా జానపద గీతాలతో కళాకారులు పాటలు ఆలపించగా, అంతే జోష్తో ప్లేయర్లు మాస్ డ్యాన్స్లతో దుమ్మురేపారు. సాంస్కృతిక కార్యక్రమాలు ప్లేయర్లలో జోష్ నింపితే.. ప్రజాప్రతినిధులు, స్టార్ ప్లేయర్లు, అర్జున, ద్రోణాచార్య, పద్మశ్రీ అవార్డు గ్రహీతలకు, సివిల్స్కు ఎంపికైన వారికి సన్మానం, స్టేడియంలో పటాకుల వెలుగు, జిలుగులు వేడుకలను శిఖరస్థాయికి తీసుకెళ్లాయి.
ప్లేయర్లకు సన్మానం : జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో దేశ ఖ్యాతిని ఇనుమడింపజేసిన రాష్ట్ర క్రీడా ఆణిముత్యాలను సీఎం కప్ సందర్భంగా సముచిత రీతిలో సన్మానించారు. యువ బాక్సర్లు నిఖత్ జరీన్, మహమ్మద్ హుసాముద్దీన్, అర్జున అవార్డు గ్రహీత అనూప్కుమార్ యమా, వెటరన్ అథ్లెట్ జేజే శోభ..మంత్రి శ్రీనివాస్గౌడ్ చేతుల మీదుగా పురస్కారం అందుకున్నారు.
ప్లేయర్లతో ప్రమాణం : సీఎం కప్లో పోటీపడుతున్న ప్లేయర్లతో స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ ప్రమాణం చేపించింది. స్ఫూర్తిదాయక ప్రదర్శన కనబరుస్తూ ఎక్కడా ఆత్మవిశ్వాసం కోల్పోకుండా గెలుపు, ఓటములను సమంగా స్వీకరిస్తామంటూ ప్లేయర్లందరూ ప్రతిజ్ఞ చేశారు.
సీఎం కప్ టోర్నీ కొత్త కళను సంతరించుకుంది. వివిధ జిల్లాల నుంచి వచ్చిన ప్లేయర్లతో హైదరాబాద్కు అందం వచ్చింది. ప్రతిభ కల్గిన ప్లేయర్లను వెలుగులోకి తీసుకొచ్చే ఉద్దేశంతో మొదలైన టోర్నీలో ప్లేయర్లు వివిధ దశల్లో సత్తాచాటుతున్నారు. మండల స్థాయి నుంచి మొదలుపెడితే జిల్లా, రాష్ట్ర స్థాయి వరకు ఎక్కడా జోష్ తగ్గకుండా ప్లేయర్లు అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నారు.ఓవైపు ప్రధాని నరేంద్రమోదీ..దేశ రాజధానిలో రెజ్లర్లపై నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడుతుంటే..మరోవైపు మన రాష్ట్రంలో ప్లేయర్లను ఘనంగా సన్మానించుకుంటున్నాం.
-సాట్స్ చైర్మన్ డా. ఆంజనేయగౌడ్ జోష్గా మార్చ్ఫాస్ట్
రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి ప్లేయర్లతో మార్చ్ఫాస్ట్ ఆద్యంతం యమ జోష్తో సాగింది. అక్షర క్రమాన్ని అనుసరిస్తూ ఆదిలాబాద్ జట్టుతో మొదలై ఆతిథ్య హోదాలో హైదరాబాద్ టీమ్తో మార్చ్ఫాస్ట్ ముగిసింది. ఈ క్రమంలో మంత్రులు శ్రీనివాస్గౌడ్, మల్లారెడ్డి, సాట్స్ చైర్మన్ ఆంజనేయగౌడ్, ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, అంజయ్యయాదవ్, క్రీడాశాఖ ముఖ్య కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియాతో పాటు ఆయా సంస్థల చైర్మన్లు ప్లేయర్ల నుంచి గౌరవవందనం స్వీకరించారు. వ్యాఖ్యాతలు ప్రతీ జిల్లా విశిష్టతను వివరించడం ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు వేణుగోపాలాచారి, రావుల శ్రీధర్రెడ్డి, గజ్జెల నగేశ్, అనిల్ కూర్మాచలం, గెల్లు శ్రీనివాస్యాదవ్, ఒలింపిక్ అసోసియేషన్ కార్యదర్శి జగదీశ్యాదవ్, జాతీయ హ్యాండ్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్రావు తదితరులు పాల్గొన్నారు.
ప్రతీ ఏడాది సీఎం కప్
సీఎం కప్ టోర్నీని ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్నాం. సీఎం కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకెళుతున్నట్లే..క్రీడల్లోనూ జాతీయ, అంతర్జాతీయ స్థాయికి ప్లేయర్లను తీర్చిదిద్దాలన్న ప్రణాళికతో ముందుకెళుతున్నాం. సమైక్య రాష్ట్రంలో నిర్లక్ష్యానికి గురైన క్రీడలు ప్రత్యేక రాష్ట్రంలో మెరుగైన గుర్తింపు పొందుతున్నాయి. జాతీయ, అంతర్జాతీయ వేదికలపై దేశ ఖ్యాతిని, ప్రతిష్టను ఇనుమడింపజేసిన ప్లేయర్లను సముచిత రీతిలో గౌరవించుకోవడంతో పాటు ఉన్నత ఉద్యోగ అవకాశాలు, విలువైన స్థలాలు అందిస్తున్నాం.
నిఖత్జరీన్, ఇషాసింగ్, త్రిష, ఉప్పల ప్రణీత్ లాంటి ప్లేయర్లను స్ఫూర్తిగా తీసుకుంటూ భవిష్యత్లో మరింత మంది ప్రతిభ కల్గిన ప్లేయర్లను దేశానికి అందించాలన్న సదుద్దేశంతో ముందుకెళుతున్నాం. ఈ క్రమంలో దేశంలో ఎక్కడా లేని విధంగా తొలిసారి సీఎం కప్ పేరిట క్రీడాటోర్నీని నిర్వహిస్తున్నాం. ఇక నుంచి ప్రతీ ఏడాది సీఎం కప్ నిర్వహిస్తాం. పతకాలు సాధించిన వారికి స్పోర్ట్స్ కోటా కింద రెండు శాతం రిజర్వేషన్ కల్పించేందుకు అవకాశాన్ని పరిశీలిస్తున్నాం. దేశంలో మిగతా రాష్ర్టాలకు ఆదర్శంగా నిలిచేలా త్వరలో క్రీడాపాలసీ తీసుకురాబోతున్నాం. సీఎం కప్ను విజయవంతం చేస్తున్న అందరికీ కృతజ్ఞతలు.
– మంత్రి శ్రీనివాస్గౌడ్
నృత్యాలు అదుర్స్
సీఎం కప్ ఆరంభ వేడుకల్లో సాంస్కృతిక కార్యక్రమాల్లో సంప్రదాయక కళారీతులు అందరినీ ఆకట్టుకున్నాయి. సంగీత నాటక అకాడమీ చైర్పర్సన్ దీపికారెడ్డి నేతృత్వంలో కళాకారులు చేసిన నృత్యాలు కనుల విందు చేశాయి. దీనికి తోడు ఆఖర్లో ఆస్కార్ అవార్డు విజేత, యువ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తనదైన రీతిలో జోష్ నింపుతూ పాడిన పాటలు ఆరంభ వేడుకలకు కొత్త అందాన్ని తీసుకొచ్చాయి. రాహుల్ పాడిన పాటలను యువతీయువకులు మస్తు ఎంజాయ్ చేశారు.