నెల రోజుల క్రితం చెన్నైలో మొదలైన ఐపీఎల్ క్రికెట్ సినిమాలో ఒక అంకం ముగిసింది. మొత్తం 74 మ్యాచ్లు (70 లీగ్, 4 నాకౌట్) ఉన్న ఈ లీగ్లో ఆదివారం పంజాబ్-గుజరాత్ మధ్య ముగిసిన మ్యాచ్తో సగం సీజన్ పూర్తయింది. మునుపెన్నడూ చూడని విధంగా రికార్డుల హోరుతో పొట్టి క్రికెట్లో 200 అంటేనే అబ్బో! అనుకునే దశ నుంచి.. వన్డేలలో మాదిరిగా 270, 280 స్కోర్లు చేస్తూ ‘మిషన్ 300’ను పూర్తిచేసే దిశగా ఐపీఎల్ సాగుతోంది. 35 మ్యాచ్లు ముగిసేటప్పటికీ ఈ సీజన్లో ఇప్పటికే 8.99 రన్రేట్తో ‘ఐపీఎల్లో మోస్ట్ హైస్కోరింగ్ సీజన్’గా 2024 రికార్డులకెక్కింది.
17వ సీజన్లో పరాగ్, అభిషేక్, శశాంక్ సింగ్, అశుతోష్ వంటి పలువురు కుర్రాళ్లు అందివచ్చిన అవకాశాలను రెండు చేతులా అందుకుంటుంటే.. వేలంలో కోటానుకోట్లు దక్కించుకున్న స్టార్క్, కమిన్స్, కరన్, గ్రీన్ లాంటి ఆటగాళ్లు అట్టర్ప్లాఫ్ అవుతున్నారు. ఈ సీజన్ ఆరంభంలో కొన్ని మ్యాచ్ల పాటు సొంత మైదానంలో మ్యాచ్లు ఆడిన జట్లు గెలవగా తర్వాత ఈ సంప్రదాయం మారింది. అసలు అంచనాలే లేకుండా బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ ఏడు విజయాలు, 14 పాయింట్లతో సగం సీజన్ లోపే ప్లేఆఫ్స్ బెర్తును దాదాపు ఖాయం చేసుకోగా కెప్టెన్ను మార్చిన ముంబై ఇండియన్స్ అంతర్గత విభేదాలతో సతమతమవుతోంది.
కొత్త కెప్టెన్ కమిన్స్ నాయకత్వంలో హైదరాబాద్ రికార్డుల మీద రికార్డులతో ప్లేఆఫ్స్కు దగ్గరవుతోంది. ఐపీఎల్లో అత్యం త జనాకర్షక జట్టు అయిన బెంగళూరు పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచి అభిమానులను తీవ్ర నిరాశపరుస్తోంది. గత రెండు సీజన్లలో ప్లేఆఫ్స్ చేరిన గుజరాత్.. సగం సీజన్ ముగిసేసరికి నిరాశజనక ప్రదర్శనలతో విఫలమవుతోంది. సగం సీజన్ ముగిసిన నేపథ్యంలో ఇక నుంచి జట్లకు ప్రతి మ్యాచ్ కీలకం కానుంది.
బ్యాటర్లు బరిలోకి దిగితే బౌలర్లపై బాదుడు మంత్రాన్ని ప్రయోగించడంతో ఈ సీజన్లో 13 ఏండ్లుగా పదిలంగా ఉన్న ఆర్సీబీ అత్యధిక పరుగుల రికార్డు (263) నాలుగుసార్లు బ్రేక్ కాగా అందులో హైదరాబాదే ఏకంగా మూడుసార్లు బద్దలుకొట్టింది. హైదరా‘బాదుడు’కు బెంగళూరు (287), ముంబై (277), ఢిల్లీ (266) బాధితులయ్యాయి. ఢిల్లీపై కోల్కతా 272 పరుగులు చేసి మూడో అత్యధిక స్కోరు చేసింది.
37 మ్యాచ్లు ముగిసేటప్పటికీ ఈ సీజన్లో ఏడు సెంచరీలు
668 సిక్సర్లు నమోదయ్యాయి